మొక్కజొన్న మిషన్‌ పడి మహిళా కూలీ ..

25 May, 2023 01:28 IST|Sakshi
మృతి చెందిన ఉపేంద్ర

అనాథలుగా మారిన పిల్లలు

పర్వతగిరి : వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలంలోని చింతనెక్కొండ గ్రామం వద్ద ట్రాక్టర్‌ నడుస్తున్న క్రమంలో దానికి వెనకాల ఉన్న మక్కజొన్న మిషన్‌ అటుఇటు ఊగుతూ కింద పడడంతో మహిళా కూలీ లకావత్‌ ఉపేంద్ర (35) అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్సై దామెరుప్పుల దేవేందర్‌ కథనం ప్రకారం.. రోజువారీ కూలీ పనిలో భాగంగా గూడూరు మండలంలోని చక్రుతండాకు చెందిన ఉపేంద్ర తోటి కూలీలతో కలిసి చింతనెక్కొండ గ్రామానికి మక్కజొన్నలు పట్టేందుకు వచ్చింది. గ్రామంలో ఓ రైతు వద్ద మక్కజొన్న పట్టి మరో రైతు వద్దకు మక్కజొన్న పట్టేందుకు ట్రాక్టర్‌ ఇంజన్‌ వెనకాల మొక్కజొన్న పట్టే మిషన్‌పై కుడి వైపు ఇద్దరు, ఎడమ వైపు ఇద్దరు కూర్చుని వెళ్తున్న క్రమంలో మిషన్‌ అదుపు తప్పడంతో ముగ్గురు కింద దూకగా ఉపేంద్ర మీద మిషన్‌ పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలు

ఉపేంద్ర భర్త నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఉపేంద్ర కూలి పనులు చేసుకుంటూ తన ఇద్దరు పిల్లలను సాకుతోంది. ఆమె బుధవారం మృతి చెందగా ఆమె కొడుకు, కూతురు అనాథలుగా మారారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు,,

కేసముద్రం : ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన ఇనుగుర్తి మండలంలోని అయ్యగారిపల్లి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. నెక్కొండ మండల కేంద్రానికి చెందిన ఎండి.యాకూబ్‌ పాషా (23) ఈనెల 22న కేసముద్రం స్టేషన్‌లో ఉంటున్న తన సోదరుడి వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం అయ్యగారిపల్లి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. తిరిగి కేసముద్రం వైపు వస్తుండగా అయ్యగారిపల్లి, మహముద్‌పట్నం గ్రామాల మధ్య బైక్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో యాకూబ్‌ పాషా తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి..

స్టేషన్‌ఘన్‌పూర్‌ : మండలంలోని తాటికొండ క్రాస్‌ రోడ్డు రిజర్వాయర్‌ కట్ట సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్‌ ఢీకొట్టిన ఘటనలో శివరాత్రి మల్లయ్య (55) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా.. మండలంలోని మీదికొండ శివారులోని వడ్డెగూడెంకు చెందిన శివరాత్రి మల్లయ్య తన ద్విచక్ర వాహనంపై స్టేషన్‌ఘన్‌పూర్‌కు వచ్చి తిరిగి రాత్రి వడ్డెగూడెం వెళ్తుండగా తాటికొండ క్రాస్‌రోడ్డు సమీపంలో ట్రాక్టర్‌ ఢీకొట్టింది. మృతుడికి భార్య పూలమ్మ, ముగ్గురు కూతుళ్లున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాఘవేందర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు