● ఉక్రెయిన్లో భారతీయ విద్యార్థులకు దివ్యారాజ్రెడ్డి చేయూత
● యుద్ధ సమయంలో స్వదేశానికి తరలింపులో కీలక పాత్ర
● నగర మెట్రో పైలట్లుగా దూసుకెళ్తున్న నారీ మణులు
● ప్రయాణికుల భద్రతే లక్ష్యం అంటున్న ‘ఆర్పీఎఫ్’ మహిళా సిబ్బంది
● ఖిల్లా మైసమ్మ ఆలయంలో అతివలే పూజారులుగా..
● అన్ని రంగాల్లోనూ తమదైన శైలితో ముందుకెళ్తున్న వనితలు
శక్తియుక్తుల్లో నారీమణులు విజయ భేరి మోగిస్తున్నారు. ఏ రంగమైనా సరే తమదైన శైలితో ముందుకెళ్తున్నారు. నగరంలో మెట్రో పైలట్లుగా రాణిస్తున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లోనూ మహిళా సిబ్బంది ప్రయాణికుల భద్రతకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. రష్యా– ఉక్రెయిన్ వార్ సమయంలో భారత వైద్య విద్యార్థులను క్షేమంగా ఇండియాకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు నగర వైద్యురాలు, నియో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీఈఓ డాక్టర్ దివ్యారాజ్రెడ్డి. రంగారెడ్డి జిల్లా ఎన్టీఆర్నగర్ సమీపంలోని ఖిల్లా మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి పూజలు జరిపేది మహిళలే. ఇలా.. అన్ని రంగాల్లోనూ అతివలు తమదైన ముద్రతో విజయ పథాన సాగుతున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు.
– సాక్షి, సిటీబ్యూరో
ఆర్పీఎఫ్ మహిళా సిబ్బందితో దేబస్మిత ఛటోపాధ్యాయ
కరోనా సమయంలోనూ దీపారాధన చేశాం..
వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఖిల్లా మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి నిత్య పూజలు చేస్తున్నాం. కరోనా సమయంలో సైతం అమ్మవారి గర్భగుడిలో నిత్య దీపారాధన చేశాం. ఈ వృత్తిలో కొనసాగడం మాకెంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం మేము, రాబోయే తరాలకు మా కోడలు కూడా పూజలకు సిద్ధమయ్యారు.
–లక్ష్మమ్మ, మహిళా పూజారి