మలుపు తిరిగిన అమ్నీషియా పబ్ అత్యాచార కేసు

26 Apr, 2023 11:02 IST|Sakshi

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్‌లో గతేడాది మే 22వ తేదీన ఓ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో మైనర్లను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఏ2 నిందితుడి తండ్రి హైకోర్టును ఆశ్రయించగా ఈ తీర్పుపై అభ్యంతరాలను పరిశీలించాలని జువైనల్‌ కోర్టును హైకోర్టు ఆదేశించింది. అమ్నీషియా పబ్‌లో గతేడాది ఓ పార్టీకి వచ్చిన బాలికను ట్రాప్‌ చేసి అయిదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. జువైనల్‌ జస్టిస్‌ బోర్డు నలుగురు నిందితులను మేజర్లుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.

దీన్ని సవాల్‌ చేస్తూ తన కొడుకును మైనర్‌గా పరిగణించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఓ తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, కేవలం మరసారి పరిశీలించాలని మాత్రమే జువైనల్‌ కోర్టుకు సూచిస్తామని తెలిపింది. జువైనల్‌ కోర్టులో ఉన్న ఈ కేసు 12వ అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు(పోక్సో కోర్టు)కు బదిలీ చేశారు. అవకతవకలు జరిగాయని రివిజన్‌ పిటిషన్‌ వేయగా కోర్టు ఈ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. దీంతో ఏ2 నిందితుడి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు.

వాదనలు విన్న జస్టిస్‌ అనుపమా చక్రవర్తి సంబంధిత కోర్టులోనే తేల్చుకోవాలంటూ ఆదేశాలు జారీ చేస్తూ అభ్యంతరాలు పరిశీలించాలని పోక్సో కోర్టుకు సూచించింది. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల మానసిక పరిపక్వత మేజర్ల తరహాలోనే ఉందని వారిని మైనర్లుగా పరిగణించకూడదని జూబ్లీహిల్స్‌ పోలీసులు గతంలోనే కోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. ఇందుకు సంబంధించిన గట్టి శాసీ్త్రయ ఆధారాలు సమర్పించారు.

మరిన్ని వార్తలు