ఫైజర్‌ ట్రైల్స్‌ ‌‌: చావు బతుకుల మధ్య బాలిక

9 Jul, 2021 19:18 IST|Sakshi
బాధితురాలితో తల్లి స్టెఫినీ

ఓహియో : ఫైజర్‌ ట్రైల్స్‌లో వాలంటీర్‌గా పాల్గొన్న ఓ బాలిక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వీల్‌ ఛైర్‌కు పరిమితమై అల్లాడిపోతోంది. అమెరికాలో చోటుచేసుకున్న ఈ సంఘటన గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఓహియోకు చెందిన స్టెఫినీ డి గ్రే కూతురు 12 ఏళ్ల మ్యాడీ డీ గ్రే ఫైజర్‌ ట్రైల్స్‌లో వాలంటీర్‌గా పాల్గొంది. కొద్ది రోజుల క్రితం ఫైజర్‌ వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్‌ తీసుకుంది. ఆ తర్వాతి నుంచి కడుపులో, రొమ్ము భాగంలో నొప్పి రావటం మొదలైంది. ‘‘ అమ్మా! నాగుండె గొంతులోంచి బయటకు వస్తున్నట్లు ఉంది’ అంటూ తన బాధను తల్లికి చెప్పుకుంది. ఆ తర్వాత గ్యాస్ట్రోపారెసిస్‌, న్యూసియా, వాంతులు రక్తపోటు వంటి ఇతర సమస్యలు కూడా తలెత్తాయి.

దీనిపై స్టెఫినీ మాట్లాడుతూ.. ‘‘ తనకు తిన్న ఆహారం అరగటం లేదు. ట్యూబ్‌ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నాము. కనీసం ఒక్క అడుగు కూడా నడవలేని స్థితిలో ఉంది. వీల్‌ ఛైర్‌కు పరిమితమైంది. మెడ పైకెత్తడానికి వీలులేకుండా ఉంది. ప్రభుత్వ అధికారులు కానీ, ఫైజర్‌ యాజమాన్యం కానీ, దీనిపై స్పందించలేదు. నా కూతురికి ఎందుకిలా జరుగుతోందో వాళ్లు కనిపెట్టాలి. ఈ మేరకు పరిశోధనలు జరగాలి. ముఖ్యంగా ట్రైల్స్‌లో పాల్గొంటున్న వారి విషయంలో. ట్రైల్స్‌లో భాగంగా అనారోగ్యం పాలవుతున్న వారికి సరైన చికిత్స అందేలా ఉండాలి. లేదంటే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది’’ అని పేర్కొంది.
 

మరిన్ని వార్తలు