సెంట్రల్‌ మెక్సికోలో కాల్పులు.. 19 మంది మృతి

28 Mar, 2022 20:34 IST|Sakshi

మెక్సికో: మెక్సికో దేశంలో ఆదివారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. సెంట్రల్‌ మెక్సికోలో గుర్తు తెలియని వ్యక్తులు జరిగిన కాల్పుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారని స్టేట్‌ అటార్నీ జనరల్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మిచోకాన్‌ రాష్ట్రంలోని లాస్‌ టినాజాస్‌ పట్టణంలో ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఓ ఉత్సవంలో గుమిగూడిన వారిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు  తమకు సమాచారం అందిందని అధికారులు పేర్కొన్నారు.

ఈ ఘటనలో 19 మంది మృతదేహాలను గుర్తించినట్లు, వీరిలో 16 మంది పురుషులు ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాలపై తుపాకీ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. మరికొంతమంది గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. అయితే ఈ హింసాత్మక చర్యలకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ఫెడరల్‌ అధికారులు పనిచేస్తున్నారని మిచోకాన్ పబ్లిక్‌ సెక్యూరిటీ సెక్రటరీ కార్యాలయం ట్విటర్‌లో తెలిపింది.
చదవండి: Ukraine: న్యూక్లియర్ పవర్‌ ప్లాంట్‌ దగ్గర తగలబడుతున్న అడవి.. పెను ముప్పు తప్పదా?

కాగా మిచోకాన్‌ దాని పరిసర ప్రాంతం గునజుటో మెక్సికోలోనే  అత్యంత హింససాత్మక ఘటనలు చోటుచేసుకునే రాష్ట్రాలుగా గుర్తింపు పొందాయి. ఇక్కడ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు నిత్యం కాల్పులు జరుపుతూ ఉంటాయి. డ్రగ్స్ స్మగ్లింగ్, ఆయిల్ దొంగతనం సహా అక్రమ కార్యకలాపాలకు పాల్పడే ముఠాల మధ్య ఆధిపత్య పోరుతో కాల్పుల్లో ప్రతి ఏడాది వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
చదవండి: మహిళను అడ్డుకున్న సిబ్బంది.. ఇండియన్‌ రెస్టారెంట్‌ మూసివేత

మరిన్ని వార్తలు