న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో యుద్ధ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 2,000 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చామని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధ్దన్ శ్రింగ్లా ఆదివారం చెప్పారు. మిగిలిన వారందరినీ త్వరగా రప్పించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఉక్రెయిన్, రష్యా రాయబారులతో వేర్వేరుగా మాట్లాడానని తెలిపారు.
ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులకు తగిన రక్షణ కల్పించాలని కోరానని అన్నారు. ఉక్రెయిన్–హంగేరి, ఉక్రెయిన్–రొమేనియా సరిహద్దుల్లో ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేవని, భారతీయులు రోడ్డు మార్గం ద్వారా అక్కడికి చేరుకుంటున్నారని వివరించారు. పోలండ్ సరిహద్దు మాత్రం ఉక్రెయిన్ ప్రజలతో కిక్కిరిసిపోతోందని చెప్పారు. భారతీయులు అక్కడికి చేరుకోవడం ఇబ్బందికరంగా మారిందని వెల్లడించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో దాదాపు 2,000 మంది భారతీయులు ఉన్నారని, వారిలో చాలామంది యుద్ధ భయం అంతగా లేని దేశ దక్షిణ ప్రాంతానికి వెళ్తున్నారని తెలిపారు. అంతేకాదు ఈ రోజు ఉదయానికి మరో 289 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చామని కూడా వెల్లడించారు