24 మంది భారత జాలర్లను అరెస్ట్‌ చేసిన లంక

30 Nov, 2022 06:10 IST|Sakshi

కొలంబో: తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి చేపలవేటకు సిద్ధమయ్యారంటూ 24 మంది భారతీయ జాలర్లను శ్రీలంక అరెస్ట్‌చేసింది. ఉత్తర జాఫ్నా పరిధిలోని కరాయ్‌నగర్‌ తీరం సమీపంలో వీరిని మంగళవారం అరెస్ట్‌చేసి వారి ఐదు చేపల వేట పడవలను శ్రీలంక నావికా, గస్తీ దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

దీంతో తమిళనాడు జాలర్లను విడుదల కోసం శ్రీలంక ప్రభుత్వంతో భారత సర్కార్‌ సంప్రదింపులు జరపాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆయన విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌కు లేఖ రాశారు. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఇలా 252 మంది భారతీయ జాలర్లను శ్రీలంక అధికారులు అరెస్ట్‌చేశారు. భారత్‌–శ్రీలంక ద్వైపాక్షిక సత్సంబంధాలకు జాలర్ల అంశం సమస్యాత్మకంగా ఉన్న విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు