75 ఏళ్ల తర్వాత... తన పూర్వీకులను కలుసుకున్న 92 ఏళ్ల బామ్మ!

17 Jul, 2022 16:51 IST|Sakshi

ఇస్లామాబాద్‌: సుహృద్బావన చర్యలో భాగంగా పాకిస్తాన్‌ హైకమిషన్‌ రీనా చిబర్‌ అనే 92 ఏళ్ల భారతీయ మహిళకు మూడు నెలల వీసాను జారీ చేసింది. దీంతో ఆమె తన పూర్వీకులు ఇంటిని సందర్శించడానికి పాకిస్తాన్‌ పయనమయ్యింది. ఈ మేరకు ఆమె పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ప్రేమ్‌నివాస్‌లో ఉన్న తన పూర్వీకుల ఇంటిని చూసేందుకు శనివారం వాఘా అట్టారీ సరిహద్దులను దాటి వెళ్లింది.  సదరు మహిళ కుటుంబం 1947లో దేశ విభజన సమయంలో భారత్‌కి తరలివెళ్లింది.

అప్పుడు ఆమెకు 15 ఏళ్లు. ఆ తర్వాత 1965లో ఆమె పాకిస్తాన్‌లో ఉంటున్న తన పూర్వీకుల ఇంటిని సందర్శించడానికి వీసా కోసం దరఖాస్తు చేసింది. ఐతే ఆ సమయంలో ఇరు దేశాల మధ్య యుద్ధం కారణంగా... తీవ్ర ఉద్రిక్తల నడుమ ఆమెకు వీసా లభించలేదు. ఆ తదనంతరం ఆమె ఎన్నోసార్లు ప్రయత్నించినా ఆమెకు వీసా లభించలేదు.

ఎన్నో సిఫార్సులు, మరికొద్దిమంది పలుకబడిన వ్యక్తుల సహాయ సహకారాలతో ఆమె పాకిస్తాన్‌ హై కమిషన్‌ నుంచి వీసా పొందగలిగింది. ఈ మేరకు ఆమె తనకు ఇరు దేశాల నుంచి సులభంగా రాకపోకలు సాగించేలా వీసా పరిమితులను సడలించడానికి రెండు దేశాల ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. తన పూర్వీకులు ఇంటిని, స్నేహితులను కలుసుకున్నాందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది.

(చదవండి: చైనా పదే పదే ఇలా ఎందుకు చేస్తుందో చెప్పలేను’)

మరిన్ని వార్తలు