యూకేలో 2200 కోట్ల పెట్టుబడి: సీరం అధినేత నిర్ణయం

4 May, 2021 17:46 IST|Sakshi

లండన్‌: ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీదారు సీరం ఇన్ట్సిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అధిపతి అదార్‌ పూనావాలా భారత్‌లో తనను బెదిరిస్తున్నారని చెప్పి తన ఫ్యామిలీతో కలిసి యూకే వెళ్లిన విషయం తెలిసిందే. యూకేలో కొత్త వ్యాక్సిన్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అదార్‌ పూనావాలా సన్నాహాలను మొదలు పెట్టారు. దానిలో భాగంగా సుమారు 300 మిలియన్‌ డాలర్లును బ్రిటన్‌లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యాడు. భవిషత్తులో టీకా ఉత్పతి కేంద్రాలకు అవసరమైన సౌలభ్యాలను నిర్మించనున్నట్లు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సోమవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. కాగా  334 మిలియన్‌ డాలర్ల ప్రాజెక్టుతో బ్రిటన్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌, పరిశోధనలు, వ్యాక్సిన్‌ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జాన్సన్‌ అధికార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

సీరం తక్కువ ఖర్చుతో కూడిన ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ షాట్‌ను ఉత్పత్తి చేయడంలో ముందంజలో ఉంది. కరోనాను కట్టడి చేయడానికి నాజిల్‌ వ్యాక్సిన్‌ను తయారు చేయడంలో సీరం కీలకపాత్ర పోషిస్తోంది. ఈ వ్యాక్సిన్‌ నేరుగా ముక్కులో ఒక డోసు స్ప్రే చేస్తారు. ప్రస్తుతం సీరం యూకేలో మొదటి ఫేజ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను మొదలుపెట్టింది. సీరం పెట్టుబడి భారత్‌, యూకే వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాల విస్తృత ప్యాకేజీలో భాగమని డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది. దీంతో సుమారు 6500  మం‍దికి ఉద్యోగకల్పన జరుగుతుందని తెలిపారు.  ఈ ఒప్పందం యూకే ప్రధాని​ బోరిస్‌, భారత ప్రధాని నరేంద్రమోదీకి మంగళవారం జరిగిన వర్చువల్‌ మీటింగ్‌ కంటే ముందుగానే  జరగడం విశేషం.

చదవండి: కరోనా వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన సీరం

మరిన్ని వార్తలు