Russia Ukraine War: పాపం.. దురదృష్టవంతుడు! ఆ హింస పడలేక దేశం విడిస్తే.. మళ్లీ అదే పరిస్థితి!

28 Feb, 2022 14:02 IST|Sakshi

Afghan Man Again Escape Poland: అఫ్గనిస్తాన్‌కి చెందిన అజ్మల్‌ రహ్మనీ ఒక ఏడాది క్రితం అప్గనిస్తాన్‌ విడిచి పెట్టి ఉక్రెయిన్‌ వచ్చాడు. అఫ్గాన్‌లోని హింస నుంచి తప్పించుకుని ఉక్రెయిన్‌లో హాయిగా జీవిద్దామని అనుకున్నాడు. అయితే అఫ్గాన్‌లో అనుక్షణం భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన అతనికి ఉక్రెయిన్‌ అత్యంత స్వర్గధామంగా అనిపించింది. మళ్లీ గత నాలుగు రోజులుగా రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేస్తుండటంతో భయాందోళనలతో మళ్లీ పోలాండ్‌ సరిహద్దుకు పరిగెత్తాడు. ఈ బాంబుల మోత తనను వదలడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.

తాను ఒక యుద్ధం నుంచి తప్పించుకుని మరో దేశం పరిగెత్తాను, మళ్లీ ఈ దేశంలో యుద్ధం మొదలైంది ఎంత దురదృష్టం అంటూ ఆవేదన చెందాడు. రహ్మనీ తన భార్య మినా, కుమారుడు ఒమర్‌, కూతురు మార్వాతో కలిసి ఉక్రెయిన్‌ సరిహద్దుకు కాలినడకన 30 కిలోమీటర్లు నడిచి వెళ్లామని చెప్పాడు. తాను పోలాండ్‌ వైపున ఉన్న మెడికాకు చేరుకున్న తర్వాత తన కుటుంబం ఇతర శరణార్థులతో కలిసి సమీపంలోని ప్రజెమిస్ల్ నగరానికి తీసుకెళ్లే బస్సులో వెళ్లామన్నారు.

40 ఏళ్ల రహ్మానీ, కాబూల్ విమానాశ్రయంలో 18 ఏళ్ల పాటు అఫ్గనిస్థాన్‌లోని నాటో కోసం పనిచేశానని చెప్పారు. యూఎస్‌ బలగాల ఉపసంహరణకు నాలుగు నెలల ముందు బెదిరింపు కాల్స్‌ నేపథ్యంలో అఫ్గాన్‌ని విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అంతేకాదు తనకు అప్గనిస్తాన్‌లో మంచి జీవితం ఉందని తనకొక మంచి ఇల్లు, కారు మంచి జీతం అన్ని ఉ‍న్నాయని రహ్మానీ చెప్పారు.

అఫ్గనిస్తాన్‌ను విడిచిపెట్టడానికి వీసా కోసం తాను చాలా కష్టపడ్డానని, పైగా తనను అంగీకరించే ఏకైక దేశం ఉక్రెయిన్‌ మాత్రమేనని అతను చెబుతున్నాడు. రహ్మానీ అతని కుటుంబం పోలాండ్‌లో వీసా లేని ఇతరుల మాదిరిగానే ఉన్నాడని, నమోదు చేసుకోవడానికి 15 రోజుల సమయం ఉందని వలసదారుల స్వచ్ఛంద సంస్థ అయిన ఓక్లైన్‌ (సాల్వేషన్) ఫౌండేషన్‌ న్యాయవాది టోమాస్జ్ పీట్ర్జాక్ అన్నారు. అయితే ఉక్రెయిన్ నుంచి దాదాపు 2 లక్షల మంది వలసదారులు పోలాండ్‌లోకి ప్రవేశించారని అధికారులు తెలిపారు.

(చదవండి: రష్యాతో జతకట్టనున్న బెలారస్‌!)

మరిన్ని వార్తలు