Afghanistan: ‘శవాలపై కూడా అత్యాచారాలకు పాల్పడతారు’

24 Aug, 2021 21:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అఫ్గన్‌ శరణార్థి సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: తాలిబన్ల అరాచకాలు భరించే శక్తి తనకు లేదని, అందుకే దేశం విడిచి పారిపోయి వచ్చానని అఫ్గనిస్తాన్‌ మహిళ ముస్కాన్‌ అన్నారు. శవాలపై కూడా తాలిబన్లు అత్యాచారాలకు పాల్పడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అఫ్గన్‌ తాలిబన్ల హస్తమగతమైన నేపథ్యంలో ఆమె భారత్‌కు శరణార్థిగా వచ్చారు. ఈ క్రమంలో తమ దేశంలోని భయానక పరిస్థితుల గురించి జాతీయ మీడియాకు వెల్లడించారు. 

న్యూస్‌18తో ముస్కాన్‌ మాట్లాడుతూ.. ‘‘ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో మహిళను పంపించాలని తాలిబన్‌ ఫైటర్లు కోరతారు. ఎవరైనా తమతో రావడానికి నిరాకరిస్తే కాల్చి చంపేస్తారు. మృతదేహాలపై కూడా వాళ్లు లైంగికదాడికి పాల్పడతారు. ఒక మనిషి బతికుందా లేదా చచ్చిపోయిందా అన్న విషయాలతో వాళ్లకు సంబంధం ఉండదు. అక్కడ మా పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ఒక్క విషయం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. 

ఇక ప్రభుత్వానికి మద్దతుగా ఉద్యోగానికి వెళ్లే మహిళల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారితో పాటు వారి కుటుంబాలు కూడా ప్రమాదంలో పడినట్లే. ఒక్కసారి వార్నింగ్‌ ఇచ్చాక వినలేదంటే.. మరోసారి వార్నింగ్‌ కూడా ఉండదు. అంతం చేయడమే’’ అంటూ తాలిబన్ల అరాచకాల గురించి చెప్పుకొచ్చారు. కాగా తమ తొలి మీడియా సమావేశంలో భాగంగా తాలిబన్లు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. కో ఎడ్యుకేషన్‌ రద్దు చేయడం, వేశ్యా గృహాల్లో జంతువులను ఉంచడం ద్వారా తమ వైఖరి ఏమిటో స్పష్టం చేశారు.  

ఇదిలా ఉండగా... అఫ్ఘానిస్థాన్‌లో  తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు మహిళలపై ఆంక్షలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకు రావొద్దని తాలిబన్లు హెచ్చరికలు జారీ చేశారు. భద్రతా సిబ్బంది అనుమతిస్తేనే బయటకు రావాలని ఆదేశించారు.

చదవండి: Afghanistan Crisis: కాబూల్‌ ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ.. వరుసలో ఆర్మీ మాజీ చీఫ్‌, నెటిజన్ల ఫైర్‌!

మరిన్ని వార్తలు