Afghanistan: తొలి మహిళా గవర్నర్‌ను బంధించిన తాలిబన్లు!

18 Aug, 2021 15:44 IST|Sakshi
ఫొటో: ఏఎఫ్‌పీ

కాబూల్‌: అఫ్గాన్‌ తొలి మహిళా గవర్నర్‌ సలీమా మజారీని తాలిబన్లు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తుపాకీ చేతబట్టి తమతో పోరాడిన ఆమెపై పైచేయి సాధించి ఎట్టకేలకు బంధించినట్లు తెలుస్తోంది. కాగా అఫ్గనిస్తాన్‌లోని బల్ఖ్‌ ప్రావిన్స్‌లోని చహర్‌ కింట్‌ జిల్లాకు చెందిన సలీమా అఫ్గన్‌ తొలితరం మహిళా గవర్నర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.

ఓవైపు అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ సహా ఇతర నేతలంతా పారిపోతున్నా బల్ఖ్‌ ప్రావిన్స్‌ను తాలిబన్లు ఆక్రమించకుండా ఆమె ఎదురొడ్డి పోరాడారు. కానీ.. తాలిబన్లు ఆ ప్రాంతంపై పట్టు సాధించారు. ఈ క్రమంలో సలీమాను వారు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు.. అఫ్గనిస్తాన్‌ తాలిబన్ల వశమైన నేపథ్యంలో అక్కడి మహిళలు హక్కుల కోసం పోరాడుతున్నారు. కాబుల్‌ వీధుల్లో నలుగురు మహిళలు నిరసన తెలిపారు. తమ హక్కులు కాపాడుకుంటామంటూ ఫ్లకార్డుల ప్రదర్శించారు.

కాగా తాము మారిపోయామని, ఇస్లామిక్ చట్టాల ప్రకారం మహిళలకు అన్ని హక్కులు కల్పిస్తామని తాలిబన్లు తమ తొలి మీడియా సమావేశంలో భాగంగా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మహిళలు మాత్రం తాలిబన్ల రాజ్యంలో తమ హక్కులకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: Karnataka: అఫ్గాన్లలో కలవరం.. మా వాళ్లకు అక్కడ నరకమే! 
తాలిబన్లపై కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్‌...!

మరిన్ని వార్తలు