హృదయ విదారకం: విమాన టైర్లలో మానవ శరీర భాగాలు, అవ‌య‌వాలు

18 Aug, 2021 14:26 IST|Sakshi

కాబూల్‌: తాలిబన్లు అఫ్ఘనిస్తాన్‌ను కైవసం చేసుకున్నప్పటి నుంచి అక్కడి పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య జరిగిన పోరులో అమాయక ప్రజలు బలవుతున్నారు. తాజాగా అమెరికా దీనికి సంబంధించి ఒక హృదయ విదారక ఘటనను వెల్లడించింది. గతంలో తాలిబన్ల చీకటి పాలన రోజులు  మళ్ళీ మొదలు కానుందని భావించిన ఆఫ్గన్ ప్రజలు వాటి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

కాబూల్ విమానాశ్ర‌యం నుంచి ఆదివారం ఎగిరిన అమెరికా వైమానికద‌ళ కార్గో విమానంపై ఎక్కేందుకు జ‌నం ఎగ‌బడిన విష‌యం తెలిసిందే. ఆ క్రమంలో ట‌ర్మాక్‌పై కూర్చున్న కొంద‌రు విమానం గాల్లోకి ఎగిరిన త‌ర్వాత కింద ప‌డ్డారు. ఆ హృదయ విదారక  దృశ్యాలు మనల్ని క‌లిచివేశాయి. అయితే సీ-17 గ్లోబ్‌మాస్ట‌ర్ సైనిక విమానం లో ఖాళీ లేక కొందరు ఆఫ్గన్లు విమానం వీల్ భాగంలో దాక్కున్నారు.

సుమారు 600 మందికి పైగా వెళ్లిన ఆ విమానం ఖ‌తార్‌లోని ఆల్ ఉబెయిద్ ఎయిర్‌బేస్‌లో దిగింది. ఆ విమానం అక్క‌డ దిగిన త‌ర్వాత వైమానిక ద‌ళ అధికారులకి మ‌రో షాక్ త‌గిలింది. విమాన చ‌క్రం భాగంలో మాన‌వ శ‌రీర‌భాగాలు, అవ‌య‌వాలు క‌నిపించాయని అధికారులు తెలిపారు.

స‌రుకుల‌తో వ‌చ్చిన త‌మ విమానం కాబూల్‌లో ల్యాండ్ అయిన కొద్ది సేపట్లోనే వంద‌లాది మంది విమానం ఎక్కారో తమకు తెలియ‌ద‌ని అమెరికా అధికారులు తెలిపారు. అక్కడి ప‌రిస్థితి పూర్తిగా అదుపుత‌ప్పుతున్న‌ట్లు కనిపించడంతో వెంటనే సీ-17 విమానాన్ని కాబూల్ నుంచి త‌ర‌లించామన్నారు. కాబూల్ విమానాశ్ర‌యంలో వెలుగు చూసిన ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ చేప‌డుతున్న‌ట్లు అమెరికా వైమానిక ద‌ళం తెలిపింది. విమానాశ్ర‌యం వ‌ద్ద ఏర్ప‌డ్డ గంద‌ర‌గోళంలో ప‌లువురు మృతిచెందగా, ఎంత మంది అనే విష‌యాన్ని మాత్రం స్ప‌ష్టం చేయ‌లేదు.

చదవండి: కోర్టు తీర్పును టైప్‌ చేస్తున్న స్టెనోగ్రాఫర్‌.. అంతలోనే..

మరిన్ని వార్తలు