Afghanistan: ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు.. కీలక భేటీ!

18 Aug, 2021 17:39 IST|Sakshi
హమీద్‌ కర్జాయితో తాలిబన్‌ నాయకుడి భేటీ(ఫొటో: టోలో న్యూస్‌)

కాబూల్‌: అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తాలిబన్‌ కమాండర్‌, హక్కాని నెట్‌వర్క్‌ గ్రూపు సీనియర్‌ నేత అనాస్‌ హక్కాని, అఫ్గన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయిని కలిశారు. బుధవారం జరిగిన ఈ భేటీలో కర్జాయితో సహా గత ప్రభుత్వంలో శాంతిదూతగా వ్యవహరించిన అబ్దుల్లా అబ్దుల్లా కూడా పాల్గొన్నట్లు తాలిబన్‌ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ సమావేశం జరిగిన చర్చకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ మేరకు స్థానిక టోలోన్యూస్‌ కథనం ప్రచురించింది.

కాగా తాలిబన్‌ వ్యవస్థలో హక్కాని నెట్‌వర్క్‌ ఒక ముఖ్యశాఖ. అఫ్గన్‌ను తాలిబన్లు గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నంలో ఈ నెట్‌వర్క్‌ కీలక పాత్ర పోషించింది. కాబూల్‌ను స్వాధీనం చేసుకుని సైన్యంపై పైచేయి సాధించింది. ఇక పాకిస్తాన్‌ సరిహద్దుల్లో స్థావరాలు ఏర్పరచుకున్న హక్కాని నెట్‌వర్క్‌... అఫ్గనిస్తాన్‌లో అనేకమార్లు ఉగ్రదాడులకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక అఫ్గనిస్తాన్‌ను ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష పెట్టామని, ఎవరిపై ప్రతీకార చర్యలు ఉండవని ప్రకటించినప్పటికీ ఆందోళనలు చల్లారడం లేదు.

చదవండి: Afghanistan: తొలి మహిళా గవర్నర్‌ను బంధించిన తాలిబన్లు!
Afghanistan: తాలిబన్ల రాజ్యం.. బ్రిటన్‌ ప్రధాని కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు