Kabul Airport: మరో 3 రోజులే.. రోడ్లన్నీ బ్లాక్‌ చేస్తున్న తాలిబన్లు!

28 Aug, 2021 18:53 IST|Sakshi
రోడ్లు బ్లాక్‌ చేస్తున్న తాలిబన్లు(ఫొటో: రాయిటర్స్‌)

Taliban Seal Off Large Parts of Kabul Airport: కాబూల్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో తాలిబన్లు శనివారం అదనపు బలగాలను మోహరించారు. విమానాశ్రయం వద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. అమెరికా చేపట్టిన పౌరుల తరలింపు ప్రక్రియ గడువు చివరి తేదీ(ఆగష్టు 31) సమీపిస్తున్న తరుణంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆగష్టు 15న అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పటి నుంచి వేలాది మంది ప్రజలు దేశం విడిచి వెళ్తున్న విషయం తెలిసిందే.

అమెరికా సహా మిత్ర దేశాలు తమ దేశ ప్రజలతో పాటు, అఫ్గన్‌ శరణార్థులను కూడా విమానాల్లో తరలిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే తమ పౌరులను అఫ్గనిస్తాన్‌లో ఉండాల్సిందిగా హెచ్చరించిన తాలిబన్లు... గురువారం నాటి ఐసిస్‌- కే ఘాతుకం తర్వాత చెక్‌ పోస్టుల వద్ద భద్రత మరింతగా పెంచారు. విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో అంచెలంచెలుగా భద్రత ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారులు బ్లాక్‌ చేస్తూ.. అడ్డుకుంటూ తాలిబన్‌ ఫైటర్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాగా ఇస్లామిక్‌ ఖోరసాన్‌ (ఐసిస్‌-కె) గ్రూపు కాబూల్‌ ఎయిర్‌పోర్టు వద్ద జరిపిన వరుస పేలుళ్ల ఘటనలో దాదాపు 170 మంది అఫ్గన్‌ ప్రజలు, 13 మంది అమెరికా సైనికులు మృత్యువాత పడిన విషయం విదితమే. దీంతో కన్నెర్రజేసిన అమెరికా శుక్రవారం.. నంగహర్‌ ప్రావిన్స్‌లోని ఐసిస్‌-కె టెర్రరిస్టుల కదలికలను గుర్తించి.. వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో భాగంగా కాబూల్‌ జంట పేలుళ్ల సూత్రధారిని అమెరికా దళాలు మట్టుపెట్టినట్లు సమాచారం.

చదవండి: Kabul Attack: నా తమ్ముడు చచ్చిపోయాడు.. యుద్ధంతో పాటే..
కాబూల్‌ దాడుల సూత్రధారిని మట్టుపెట్టిన దళాలు.. బరిలోకి తాలిబన్లు కూడా!

మరిన్ని వార్తలు