Afghanistan: వెంటనే ఆ హోటళ్ల నుంచి వెళ్లిపోండి.. యూఎస్‌, బ్రిటన్‌ పౌరులకు హెచ్చరిక

11 Oct, 2021 15:09 IST|Sakshi

కాబుల్‌: అఫ్గనిస్తాన్‌ రాజధాని కాబుల్‌ నగరంలోని హోటళ్లలో ఉన్న తమ దేశీయుల్ని అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు అప్రమత్తం చేశాయి. ఇటీవల ఐసీసీ గ్రూప్‌ మసీదులో దాడికి పాల్పడిన నేపథ్యంలో ఉగ్రముప్పు పొంచి ఉందని, ఆ ప్రాంతంలోని హోటళ్లకు దూరంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశాయి. భవిష్యత్తులోనూ ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉందని.. సెరెనా హోటల్‌తోపాటు ఆ పరిసరాల్లో ఉంటున్న అమెరికన్లు తక్షణమే ఆ ప్రాంతాన్ని విడిచివెళ్లాలంటూ యూఎస్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. బ్రిటన్ ప్రభుత్వం కూడా.. ‘ ఆ ప్రాంతంలో పెరిగిన ప్రమాదాల నేపథ్యంలో, అక్కడ హోటళ్లలో, ముఖ్యంగా కాబూల్‌లో సెరెనా హోటల్ వంటివాటిలో అసలు ఉండకూడదని సూచనలు చేసింది.  ( చదవండి: Afghanistan: అలా చేయకండి.. అమెరికాకు తాలిబన్లు వార్నింగ్‌ )
సెరెనా హాటలోనే ఎందుకంటే
కాబుల్‌లోని సెరెనా హోటల్‌లో విదేశీయులు ఎక్కువ బస చేస్తుంటారు. గతంలో తాలిబన్లు దీనిపై రెండుసార్లు దాడులకు కూడా పాల్పడ్డారు. 2008లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మరణించారు. అలాగే 2014 అధ్యక్ష ఎన్నికలకు ముందు కూడా మరోసారి దాడి జరగగా.. నలుగురు యువకులు హోటల్‌లోకి చొచ్చుకెళ్లి, కాల్పులు జరిపారు. ఈ దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ పాత్రికేయుడు, అతని కుటుంబ సభ్యులు ఉన్నారు.  

అఫ్గన్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి, చాలా మంది విదేశీయులు ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే కొంతమంది పాత్రికేయులు, సహాయక కార్మికులు మాత్రమే ఇప్పటికీ కాబుల్‌లో ఉంటున్నారు. తాలిబన్లు అఫ్గన్‌ను చేజిక్కించుకుని, ఇస్లామిక్ ఎమిరేట్‌గా ప్రకటించినప్పటి నుంచి ఆ దేశ ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించే ప్రయత్నాలతో పాటు అంతర్జాతీయ గుర్తింపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

చదవండి: అమేజింగ్‌ హోటల్‌! హర్ష్‌గోయెంకా పోస్ట్‌ చేసిన హోటల్‌, ఎలా ఉందో చూడండి

మరిన్ని వార్తలు