Afghanistan: మహిళా యాంకర్‌కు తాలిబన్‌ ప్రతినిధి ఇంటర్వ్యూ!

17 Aug, 2021 19:17 IST|Sakshi
ఫొటో కర్టెసీ: ట్విటర్‌

భయం భయంగానే బయటకు వస్తున్న ప్రజలు

భారత్‌కు మాత్రమే తాలిబన్లను ఎదురించే శక్తి ఉందంటున్న అఫ్గాన్‌ యువత

కాబూల్‌: గత రెండు రోజులుగా భయంతో అల్లాడిపోతున్న అఫ్గనిస్తాన్‌లో త్వరలోనే సాధారణ వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తోంది. అధిక సంఖ్యలో ప్రజలు ఇళ్లకే పరిమితం అయినప్పటికీ.. కాబూల్‌లో కొంతమంది భయం భయంగానే బయటికు వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు భర్త లేదా ఇతర కుటుంబ సభ్యులతో బుర్ఖా ధరించి బయటకు వస్తున్నట్లు సమాచారం. అఫ్గన్‌ ప్రజలకు క్షమాభిక్ష ప్రసాదించామంటూ తాలిబన్లు ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో కొన్నిచోట్ల వ్యాపారులు ధైర్యం చేసి మార్కెట్లు తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. 

మరోవైపు.. అఫ్ఘన్‌ టీవీ ఛానళ్లలో తాలిబన్‌ బోధనలు ప్రారంభమయ్యాయి. మహిళా యాంకర్లు, మహిళా రిపోర్టర్లు తెరమీదకు వస్తున్నారు. ఈ క్రమంలో.. అఫ్ఘన్‌ టాప్‌ ఛానల్‌ టోలో న్యూస్‌ చానెల్‌కు తాలిబన్‌ ప్రతినిధి అబ్దుల్‌ హక్‌ హమ్మద్‌ మహిళా యాంకర్‌ బెహెస్తాకు ఇంటర్వ్యూ ఇవ్వడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలను టోలో న్యూస్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. అయితే, ఈ విషయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘తాము మారిపోయామని నమ్మించడానికే తాలిబన్లు ఇలా చేస్తున్నారు’’ అని కొంతమంది కామెంట్‌ చేస్తుండగా.. ‘‘కనీసం మహిళకు ఇంటర్వ్యూ ఇవ్వడానికైనా ఒప్పుకొన్నారు. అయినా ఎందుకో కాస్త అనుమానంగానే ఉంది’’ అంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

భారత్‌కు మాత్రమే ఆ శక్తి ఉంది...
ఇదిలా ఉండగా... అఫ్ఘాన్‌లో మానవ హక్కులను కాలరాస్తున్నారంటూ అక్కడి యువత ఫైర్‌ అవుతోంది. ‘‘తాలిబన్లపై మాకు నమ్మకం లేదు. తాలిబన్లు వైరస్, క్యాన్సర్ లాంటివాళ్లు. తాలిబన్లు మారారు అనుకోవడం అవివేకం. అఫ్ఘాన్‌ అభివృద్ధికి భారత్ చాలా సహాయం చేసింది. తాలిబన్లు, పాకిస్తాన్, చైనా ముగ్గురూ భారత్‌కు శత్రువులే. తాలిబన్లను తరిమికొట్టే శక్తి భారత్‌కు ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: Afghanistan: ‘వాళ్ల కోసమే వెయిటింగ్‌.. వచ్చి నన్ను చంపేస్తారు’
Afghanistan: తాలిబన్ల కీలక ప్రకటన.. అఫ్గాన్‌లకు..

>
మరిన్ని వార్తలు