ఎంత దారుణం.. మార్కెట్‌లో ప్రవేశించి 47 మందిని కాల్చి చంపారు!

7 Apr, 2023 15:01 IST|Sakshi

ఆఫ్రికాలోని నైజీరియాలోని సాయుధులు నరమేధానికి తెగబడ్డారు. బెన్యూ రాష్ట్రంలోని ఉమోగిడి గ్రామంలో సాయుధులు 50 మందిని దారుణంగా చంపారు. బుధవారం నాడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 47 మందిని కాల్చి చంపినట్లు ఒటుక్పో స్థానిక ప్రభుత్వ చైర్మన్ తెలిపారు.  ఈ ఘటనకు ఒక రోజు ముందు, అదే స్థలంలో ముగ్గురు దారుణంగా హత్యకు గురయ్యారని ఆయన చెప్పారు. బెన్యూ స్టేట్ పోలీసులతో అనెన్ సీవీస్ ఈ దాడిని ధృవీకరించారు. దుండగులు అకస్మాత్తుగా మార్కెట్‌లోకి ప్రవేశించి కాల్పులు జరిపారని, ఈ దాడిలో ఒక పోలీసు అధికారి కూడా మరణించినట్లు సీవీస్ తెలిపారు.

కాగా ఈ దాడులకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత తీసుకోలేదు. దీని వెనుక ప్రధాన ఉద్దేశం తెలియాల్సి ఉంది. అధికారులు మాత్రం ఈ రెండు దాడులకు సంబంధం ఉన్నట్లు భావిస్తూ ఆ కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. కాగా ఉత్తర-మధ్య నైజీరియాలో భూ వివాదాలపై గతంలో రైతులతో ఘర్షణ పడిన స్థానిక పశువుల కాపరులపై అనుమానం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

గతంలో.. ఫులానీ మూలానికి చెందిన పశువుల కాపరులు తమ పొలాల్లో తమ పశువులను మేపుతున్నారని, ఈ కారణంగా తమ పంట నాశనమవుతోందని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఐదేళ్ల తర్వాత 1965లో తొలిసారిగా చట్టం ద్వారా ఆ భూములు మేత దారులేనని పశువుల కాపరులు నొక్కి చెప్పారు. దీంతో వీరిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బెన్యూ రాష్ట్రాన్ని "నైజీరియా ఆహార బుట్ట"గా అక్కడి ప్రజలు పిలుస్తారు. ఆ ప్రాంతంలో పంటలు సమృద్దిగా పండుతాయి. అయితే తరచుగా జరిగే ఈ ఘర్షణల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతం నుంచి వ్యవసాయ దిగుబడులు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ఆకలితో అలమటించే పేద ప్రజలను ఈ పరిస్థితి మరింత కుంగతీస్తుంది.

మరిన్ని వార్తలు