వెనక్కి తగ్గేదేలే! రాజీపడం అంటున్న తైవాన్‌.... చైనాకి స్ట్రాంగ్‌ వార్నింగ్‌

16 Oct, 2022 15:37 IST|Sakshi

తైపీ: బీజింగ్‌లో ఐదేళ్లకు ఒకసారి జరిగే కమ్యూనిస్ట్‌ పార్టీ కాంగ్రెస్‌ ప్రారంభోత్సవంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తైవాన్‌పై బలప్రయోగాన్ని ఎప్పటికి వదులుకోమని కరాఖండిగా చెప్పారు. అలాగే హాంకాంగ్‌పై పట్టు సాధించి నియంత్రణలోకి తెచ్చుకున్నామని తర్వాత తైవానే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తైవాన్‌ తీవ్రంగా ప్రతిస్పందించింది.

తన సార్వభౌమాధికారం, స్వేచ్ఛపై రాజీపడేదే లేదని, వెనక్కి తగ్గమని తెగేసీ చెప్పింది తైవాన్‌. ఈ మేరకు తైవాన్‌ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య శాంతి స్థిరత్వాన్ని కాపాడుకోవటం ఇరుపక్షాల భాద్యత అని నొక్కిచెప్పింది. యుద్ధం ఒక్కటే ఆప్షన్‌ కాదని తేల్చి చెప్పింది. తైవాన్‌లో సుమారు 23 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారని, వారికి తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. అలాగే తాము బీజింగ్‌ ఏకపక్ష నిర్ణయాన్ని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని తెగేసి చెప్పింది.

వాస్తవానికి 2016లో ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్-వెన్ తొలిసారిగా ఎన్నికైనప్పటి నుంచి చైనాతో ఉన్న సంబంధాలను కట్టడి చేసింది. రాజీకీయాలతో దిగ్బంధం చేసి సైనిక బలగాలతో బలవంతంగా అధీనంలోకి తెచ్చుకోవాలనే కుట్రలను విడిచిపెట్టాలని చైనీస్ కమ్యూనిస్ట్ అధికారులకు పిలుపినిచ్చింది తైవాన్‌. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తైవాన్‌ విషయంలో విదేశీ శక్తులు జోక్యం చేసుకుంటున్నాయని, తైవాన్‌ని స్వతంత్ర దేశంలా ఉంచే క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పుతున్నారంటూ ఆరోపణలు చేశారు. పైగా శాంతియుత పునరేకీకరణ కోసం ప్రయత్నిస్తాం కానీ యుద్ధం చేయమని హామీ ఇవ్వం అని చెప్పారు. 

(చదవండి: హాంకాంగ్‌పై నియంత్రణ సాధించాం.. తర్వాత తైవానే.. జిన్‌పింగ్‌ కీలక ప్రకటన)

మరిన్ని వార్తలు