కాబూల్‌ నుంచి భారతీయులు వెనక్కి!

16 Aug, 2021 03:39 IST|Sakshi

129 మందితో ఢిల్లీకి చేరిన ఎయిర్‌ ఇండియా విమానం

న్యూఢిల్లీ/కాబూల్‌/వాషింగ్టన్‌: అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో భారత్‌ అప్రమత్తమయ్యింది. ప్రస్తుతం కాబూల్‌లో వందలాది మంది భారతీయులు ఉన్నారు. వారందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఆదివారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించా యి. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయంలో పని చేసే సిబ్బందితోపాటు భారతీయుల ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశాయి. ఒకవేళ వారిని అత్యవసరంగా వెనక్కి తీసుకొని రావా ల్సి వస్తే అందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు చెప్పారు.

క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అఫ్గాన్‌లోని తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. భారతీయులను స్వదేశానికి రప్పించడానికి ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన సి–17 గ్లోబ్‌మాస్టర్‌ మిలిటరీ ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్‌ను ప్రభుత్వం సిద్ధంగా ఉంచినట్లు తెలిసింది. అలాగే కాబూల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి 129 మంది భారతీయులతో ఎయిర్‌ ఇండియా విమానం(ఏఐ–244) ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరింది. రాత్రి 7.40 గంటలకు ఢిల్లీకి చేరుకుంది.
మిగిలింది

విమాన మార్గమే
కాబూల్‌ సరిహద్దులన్నీ మూసుకుపోయాయి. కాబూల్‌ సమీపంలోని జలాలాబా ద్‌ను సైతం తాలిబన్లు ఆక్రమించడంతో నగరం మొత్తం దిగ్భంధనంలో చిక్కుకున్నట్లయ్యింది. దీంతో కాబూల్‌ నుంచి బయటకు వెళ్లాలన్నా, తిరిగి రావాలన్నా కేవలం విమాన మార్గమే మిగిలింది. స్వదేశానికి తిరిగి వెళ్లేవారితో కాబూల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కిక్కిరిసిపోతోంది. చాలామంది తమ సామానుతో సహా ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు.  అఫ్గానిస్తాన్‌ను బాహ్య ప్రపంచంతో అనుసంధానించడానికి కాబూల్‌ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు యథాతథంగా కొనసాగేలా సహకారం అందిస్తున్నట్లు ‘నాటో’ ప్రకటించింది.

మరిన్ని వార్తలు