వెలుగులోకి కొత్త రకం పాము

9 Dec, 2020 20:08 IST|Sakshi

హనోయ్‌: అమెరికా, వియత్నాం శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఓ కొత్తరకం, వింతైన పామును కనుగొన్నారు. వియత్నాం అడువులు, కొండప్రాంతాల్లో బయోడైవర్సీటీపై పరిశోధనలు చేస్తున్న వారు హా జియాంగ్‌ ప్రావిన్స్‌లో రంగురంగుల ఆ పామును గుర్తించారు. వెలుతురులో దాని చర్మంపై ఉన్న పొలుసులు నీలంనుంచి ఆకుపచ్చకు రంగులు మారటం గమనించారు. చూసిన వెంటనే అది ఓ పామని గుర్తించలేకపోయారు. ఆ వింత పాముకు ‘అచలినస్‌ జుగోరమ్‌’ అని నామకరణం చేశారు. అంతేకాకుండా అది అత్యంత అరుదైన జాతికి చెందిందని తెలుసుకున్నారు.

2019లో దీన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లోని విషయాలను తాజాగా ‘కోపియా’ అనే జర్నల్‌లో మంగళవారం ప్రచురించారు.  దీనిపై ఆరే మిల్లర్‌ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ.. ‘‘ అది చాలా అద్భుత క్షణం. ఆ జీవి చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. చాలా ప్రత్యేకంగా.. నిజానికి అదేంటో చూసిన వెంటనే మేము తెలుసుకోలేకపోయాము’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు