మన భాగ్యనగర వైభవం విదేశాల్లో నిక్షిప్తం

16 Feb, 2021 20:06 IST|Sakshi

భారత్‌ దక్కించుకోవాలని నిజాం వారసుల విజ్ఞప్తి

విలువైన సంపద చేజారిపోతుందని ఆవేదన

ఈ వజ్రం పోతే కోహీనూర్‌ మాదిరి పాఠాలు చెప్పుకోవాల్సిందే..

నిజాం కాలంలో వజ్రాలు రాశులుగా పోసి మార్కెట్‌లో కూరగాయల మాదిరి అమ్ముకున్నారని చదువుకున్నాం. ఇప్పుడు అలాంటి వజ్రాలు ఎక్కడా కనిపించడం లేదు. ఉన్న కొన్నింటిలో కోహీనూర్‌ వజ్రం బ్రిటన్‌ రాణి కిరీటంలో ఉండగా.. మరికొన్ని వజ్రాలు విదేశాల్లో ఉన్నాయి. నిజాం వంశస్తులకు సంబంధించిన అరుదైన ఆభరణాలు, వజ్రాలు తదితర విలువైన వస్తువులు భారతదేశం నుంచి చేజారాయి. అలా చేజారిన వాటిలో ఉన్న ఒక వజ్రం ప్రస్తుతం వేలానికి పెట్టారు. 

గోల్కొండలో లభించిన అపురూపమైన, అరుదైన వజ్రం న్యూయార్క్‌‌లోని ఫార్చునా ఆక్షన్‌ హౌస్‌లో వేలం వేస్తున్నారు. 3.05 క్యారెట్ల వజ్రం రూ.కోటిన్నరకు విలువ చేస్తుందని అంచనా. వీటితో పాటు కుతుబ్ షాహీ కాలంలో గోల్కొండ నుంచి తవ్విన వజ్రాలు, అనేక విలువైన కళాఖండాలు ఇక్కడ వేలం వేయనున్నారు. గోల్కొండ డైమండ్స్ అని పిలువబడే వజ్రాలు మచ్చలేని విలువైన రాళ్లుగా పేరు పొందాయి. ళ్లను వేలంపాటదారుల కోసం ప్రదర్శిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. అయితే ఆ వజ్రంతో పాటు మిగతా వస్తువులను భారత ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిజాం వారసులు కోరుతున్నారు. ఇప్పటికే విలువైన వస్తువులను కోల్పోయినట్లు గుర్తు చేస్తున్నారు.

ప్రస్తుతం వేలానికి వచ్చిన వజ్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయంట. నైట్రోజన్‌ ఉనికి ఉండని వజ్రం అని తెలుస్తోంది. దీంతోపాటు పసుపు రంగులో మెరుస్తుందంట. మన దక్కన్‌ సాంప్రదాయానికి గర్వంగా చెప్పుకునే వజ్రాలు చాలా ఏళ్ల కిందటే హైదరాబాద్‌ దాటింది. అనంతరం విదేశాలకు చేరింది. 

దేశానికి చెందిన అపరూపమైన సంపద విదేశాలకు తరలిపోతోందని రాయల్టీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఎస్టేట్స్‌ ప్రతినిధి నవాబ్‌ షఫాత్‌ అలీఖాన్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోల్కొండ వైభవాన్ని భావితరాలకు వివరించేందుకే భారతదేశం వేలంలొ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎలాగైనా ఆ వజ్రాన్ని మనం సొంత చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు