Omicron: మరో వుహాన్‌.. అక్కడ 90 శాతం కరోనా కేసుల్లో ‘ఒమిక్రాన్‌’

1 Dec, 2021 16:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఒమిక్రాన్‌ మూల కేంద్రంగా దక్షిణాఫ్రికా ష్వానే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

మరో వుహాన్‌గా మారిన గౌటెంగ్‌ ప్రావిన్స్‌

Another Wuhan SA Gauteng province 90 Percent Cases Related to Omicron: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. గతంలో వెలుగు చూసిన డెల్టా వేరియంట్‌ కన్నా ఇది చాలా ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరికలు జారీ చేస్తోంది. కరోనా వెలుగు చూసిన ప్రారంభంలో దీని మూల కేంద్రాన్ని చైనా వుహాన్‌గా గురించారు శాస్త్రవేత్తలు. ఇక్కడి నుంచి కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.

అలానే ఒమిక్రాన్‌ వేరియంట్‌ మూల కేంద్రాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ వేరియంట్‌ ప్రథమంగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. సౌతాఫ్రికాలోని ష్వానే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒమిక్రాన్‌ కేంద్రమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటికే ఇన్‌స్టిట్యూట్‌లోని చాలా మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో పలు పరీక్షలను రద్దు చేశారు. 
(చదవండి: కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’.. హడలిపోతున్న ప్రపంచ దేశాలు)

90 శాతం కేసుల్లో ఒమిక్రాన్‌...
జోహన్నెస్‌బర్గ్‌లోని గౌటెంగ్‌ ప్రావిన్స్‌ ప్రస్తుతం మరో వుహాన్‌గా మరింది. ఇక్కడ నమోదవుతున్న కరోనా కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్‌ వేరియంట్‌కి చెందినవే అంటున్నారు నిపుణులు. ఇక్కడ కేసులు ఇంతలా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం... తక్కువ వ్యాక్సినేషన్‌ రేటు. దక్షిణాఫ్రికాలో 18-34 ఏళ్ల మధ్య ఉన్న వారిలో కేవలం 22 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. టీకాపై అపోహల కారణంగా కూడా చాలామంది వ్యాక్సిన్‌ వేయించుకోలేదని తెలిసింది. ఈ క్రమంలో ఇప్పటికే వ్యాక్సిన్‌ వేసుకున్న వారు.. తమ తోటివారిని టీకా వేసుకోమని సూచిస్తున్నారు. వ్యాక్సిన్‌ ఒక్కటే కరోనా నుంచి కాపాడగలదని ప్రచారం చేస్తున్నారు. 

ప్రయాణాలపై నిషేధం..
డెల్టా వేరియంట్‌ కారణంగా కరోనా కేసులు, మృతుల సంఖ్య కూడా భారీగానే నమోదయ్యింది. ప్రభుత్వాలు డెల్టా వేరియంట్‌ని ప్రారంభంలో నిర్లక్ష్యం చేశాయి. ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూశాయి. డెల్టా కన్నా ప్రమాదకరమైన ఒమిక్రాన్‌ వేరియంట్‌ గురించి తెలిసిన వెంటనే అన్ని దేశాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా సౌతాఫ్రికా ప్రయాణాలపై నిషేధం విధించాయి. ఈ నిర్ణయం పట్ల దక్షిణాఫ్రికా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
(చదవండి: ఒమిక్రాన్‌.. మహమ్మారి అంతానికే వేగం పెంచిందేమో...)

అదే సమయంలో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ఆదివారం మాట్లాడుతూ.. ‘‘కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు ఉన్నప్పటికీ, దేశంలో అత్యల్ప అంటే 'మొదటి స్థాయి' లాక్‌డౌన్ మాత్రమే అమలులో ఉంటుంది’’ అని తెలిపారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాలు.. దక్షిణాఫ్రికా, దాని పొరుగు దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించాయి. దీని వల్ల తమకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని.. తక్షణమే ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేయాలని రమాఫోసా విజ్ఞప్తి చేశారు.

చదవండి: ఒమిక్రాన్‌ గురించి తెలుసుకునే లోపే చాపకింద నీరులా..!

మరిన్ని వార్తలు