రంగులు అద్దిన చిత్రం కాదండోయ్‌.. ప్రకృతి దిద్దుకున్న మనోహర దృశ్యం

18 Jul, 2022 19:29 IST|Sakshi

ఇది కాన్వాస్‌పై రంగులు అద్దిన చిత్రం కాదు.. వినీలాకాశంపై ప్రకృతి దిద్దుకున్న ముగ్ధ మనోహర దృశ్యం. దక్షిణ ధ్రువంలోని అంటార్కిటికా వద్ద గులాబీ, ఊదా, నారింజ రంగుల మిశ్రమంతో ఆకాశంపై పరుచుకున్న వర్ణమాలిక. అంటార్కిటికాలోని న్యూజిలాండ్‌ పరిశోధన కేంద్రం టెక్నీషియన్‌ స్టువర్ట్‌ షా ఈ చిత్రాలను క్లిక్‌మనిపించారు. గగనతల రంగుల వెనకున్న కారణం విచిత్రమైనదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏడాది జనవరి 15న అంటార్కిటికాకు సుమారు 7 వేల కిలోమీటర్ల దూరంలోని టోంగా దీవుల్లో ఉన్న సముద్రగర్భ అగ్నిపర్వతం బద్దలై ఏకంగా 58కి.మీ. ఎత్తుకు బూడిద, దుమ్ము, ధూళిని ఎగజిమ్మిందని చెప్పారు.

దీంతో భూ వాతావరణంలోనే నేటికీ కలియతిరుగుతున్న ధూళి తుంపరల్లో కొన్ని సూర్యోదయ, సూర్యాస్తమయాల్లో కాంతిని అడ్డుకున్నప్పుడు ఆకాశంలో ఇలా రంగురంగుల దృశ్యాలు కనిపిస్తాయని వివరించారు. ఇప్పటికే ఇలాంటి దృశ్యాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వద్ద గగనతలంపై కనిపించినట్లు చెప్పారు. ఈ అగ్ని­పర్వత ధూళి తుంపరలు సుమారు రెండేళ్లపాటు భూ వాతావరణంలో ఉంటాయని పేర్కొన్నారు. 
చదవండి: India: అత్యధిక బిలియనీర్లు ఏ రంగం నుంచి ఉన్నారో తెలుసా?

మరిన్ని వార్తలు