పెరూలో ఆందోళనలు హింసాత్మకం

23 Jan, 2023 05:02 IST|Sakshi

లిమా/వాటికన్‌ సిటీ: దక్షిణ అమెరికా ఖండంలోని పెరూలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జనం వీధుల్లోకి వస్తున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి రాజధాని లిమాకు చేరుకుంటున్నారు. అధ్యక్షురాలు డినా బోలార్టే వెంటనే నుంచి దిగిపోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగుతున్నారు. డిసెంబర్‌ నుంచి ఇప్పటిదాకా ఘర్షణలో 55 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా శుక్రవారం రాత్రి దక్షిణ పూనోలో నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది.

పోలీసులతో జరిగిన ఘర్షణలో ఒక నిరసనకారుడు మరణించాడు, 9 మంది గాయపడ్డారు. దేశంలో హింస ప్రజ్వరిల్లుతుండడంతో ప్రభుత్వ అప్రమత్తమైంది. పెరూలో 15వ శతాబ్దానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత కట్టడం, ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన మచ్చూపిచ్చూ సందర్శనను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు సాంస్కృతిక శాఖ ప్రకటించింది. మచ్చూపిచ్చూలో 417 మంది సందర్శకులు చిక్కుకుపోయారు. వారిలో 300 మందికిపైగా విదేశీయులున్నారు. పెరూలో హింసాకాండను వెంటనే ఆపాలని ప్రభుత్వానికి, ప్రజలకు పోప్‌ ఫ్రాన్సిస్‌ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు