Russian Aggression May Have Contributed To Sri Lanka Crisis: శ్రీలంక సంక్షోభానికి గల కారణం రష్యా 'దురాక్రమణ యుద్ధమే' అని యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదీగాక ఇటీవలే ఆంటోని బ్లింకెన్ ఉక్రెయిన్ నుంచి దాదాపు 20 మిలియన్ టన్నుల ధాన్యాన్ని విడిచిపెట్టాలని రష్యాకు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై రష్యా విధించిన ఆంక్షలే.. ఒకరకంగా శ్రీలంక సంక్షోభానికి కారణమై ఉండోచ్చని ఆంటోని బ్లింకెన్ అన్నారు. ప్రస్తుతం శ్రీలంక ఆహారం, ఇంధన కొరత, విదేశీ మారక నిల్వలు వంటి సంక్షోభాలతో అతలాకుతలమౌతున్న సంగతి తెలిసిందే.
ఈ రష్యా ఉక్రెయిన్పై సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోందంటూ.. బ్లింకెన్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాదు ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార అభద్రత ఇప్పుడు మరింత పెరుగుతోందన్నారు. ఈ యుద్ధం కారణంగా అదికాస్త గణనీయంగా పెరిగిందని చెప్పారు. ముఖ్యంగా థాయ్లాండ్ వంటి శక్తిమంతమైన దేశం పై కూడా ఈ యుద్ధం ప్రభావం మరింతగా ఉంటుందన్నారు.
మాస్కో ఆక్రమిత ఉక్రెయిన్ నుంచి 20 మిలియన్ టన్నుల ధాన్యాన్ని ఎగుమతి చేసే నౌకలను అడ్డుకోవద్దని రష్యాకి పదేపదే బ్లింకెన్ విజ్ఞప్తి చేశాడు. ఐతే రష్యా మాత్రం నౌకాశ్రయాల్లో ఉక్రెయిన్ పెట్టిన మందుపాతరలను తీసివేస్తే... ఆహార ఉత్పత్తులతో కూడిన ఉక్రేనియన్ నౌకలను విడిచిపెట్టడానికి అనుమతిస్తామని రష్యా చెప్పింది. అందుకు కీవ్ తిరస్కరించడం గమనార్హం.
(చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు)