జైలుపై కాల్పులు..10 మంది పోలీసులు, నలుగురు ఖైదీలు మృతి!

2 Jan, 2023 09:14 IST|Sakshi

మెక్సికన్‌ సిటీ: సరిహద్దు జైలుపై దుండగులు ఆయుధాలతో విరుచుకుపడి జరిపిన కాల్పుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ సంఘటన మెక్సికోలోని జుయారెజ్ నగరంలో ఆదివారం జరిగింది. మృతుల్లో 10 మంది భద్రతా సిబ్బంది కాగా.. నలుగురు ఖైదీలు ఉన్నట్లు మెక్సిన్‌ అధికారులు తెలిపారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారని, 24 మంది తప్పించుకోగలిగారని వెల్లడించారు. ఈ దారుణానికి ఒడిగట్టింది డ్రగ్స్‌ ముఠాగా అనుమానిస్తున్నారు.

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటలకు ఆయుధాలతో వచ్చిన దుండగులు జైలుపై కాల్పులు జరిపారు. సమచారం అందుకున్న బలగాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితులను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే, ఈ దాడికి పాల్పడింది ఎవరనే విషయంపై స్పష్టత లేదని వెల్లడించారు. 

గతంలోనూ ఇలాంటి సంఘటనలు మెక్సికో సరిహద్దు జైళ్లలో జరిగాయి. పలు కారాగారాల వద్ద భద్రత తక్కువ గా ఉండటం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డ్రగ్స్‌ ముఠాల సభ్యులు ఖైదీలుగా ఉండటం వల్ల వారి మధ్య ప్రతీకార దాడులే ప్రధానంగా జరుగుతున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: పట్టాలు తప్పిన ముంబై-జోధ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌

మరిన్ని వార్తలు