నీరవ్‌ మోదీ కోసం బ్యారక్‌ 12 సిద్ధం

27 Feb, 2021 04:02 IST|Sakshi

ముంబైలోని ఆర్థర్‌రోడ్‌ జైలులో తక్కువ ఖైదీలున్న సెల్‌ ఏర్పాటు

విజయ్‌ మాల్యాకోసం కూడా ఇదే బ్యారక్‌  

ముంబై: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం, మనీలాండరింగ్‌ కేసులో నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని యూకే, భారత్‌కి అప్పగిస్తుండడంతో, నీరవ్‌ మోదీ కోసం ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ జైలులో ప్రత్యేక సెల్‌ని సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. నీరవ్‌ని ముంబైకి తీసుకొచ్చిన వెంటనే ఆయన్ను ఆర్థర్‌ రోడ్‌ జైలులో అత్యధిక భద్రత ఉన్న బ్యారక్‌ నంబర్‌ 12లోని మూడు సెల్‌లలో ఒకదానిలో ఉంచనున్నారు. నీరవ్‌కు జైల్లో కల్పించే వసతులను గురించి మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. తక్కువ మంది ఖైదీలున్న సెల్‌లో అతడిని ఉంచుతామని జైలు అధికారులు వెల్లడించారు.

బ్యారక్‌లో నీరవ్‌కు మూడు చదరపు మీటర్ల స్థలం మాత్రమే ఉంటుంది. ఒక కాటన్‌ పరుపు, తలదిండు, ఒక దుప్పటి, కప్పుకోవడానికి బ్లాంకెట్‌ ఇస్తామని అధికారి తెలిపారు. అక్కడ తగు మాత్రంగా గాలి, వెలుతురు సోకుతుందని, ఆయనకు సంబంధించిన వస్తువులు పెట్టుకునే స్థలం కూడా ఉంటుందని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. విజయ్‌మాల్యాని యూకే నుంచి భారత్‌కి అప్పగిస్తే ఇదే ఆర్థర్‌ రోడ్‌ జైల్లో, 12వ నంబర్‌ బ్యారక్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేసినట్టు జైలు అధికారులు వెల్లడించారు. మనీలాండరింగ్, మోసం కేసులో విజయ్‌ మాల్యా మార్చి 2016 నుంచి యూకేలో ఉన్నాడు.   

మరిన్ని వార్తలు