ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియా చేరిన తొలి విమానం!

15 May, 2021 18:52 IST|Sakshi

80 మంది ప్రయాణికులతో డార్విన్‌ చేరిన తొలి స్వదేశీయాన్‌ విమానం

కాన్‌బెర్రా: దేశంలో కోవిడ్‌ విజృంభిస్తుండటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం గత నెలలో భారత్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. దీనిపై తీవ్ర మిర్శలు తలెత్తడంతో ఈ నెల 15 నుంచి భారత్‌లో చిక్కుకున్న తమ దేశ పౌరులను తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియా పౌరులను తీసుకువెళ్లిన తొలి విమానం శనివారం డార్విన్‌ చేరుకుంది. కాంటాస్‌ విమానం ద్వారా 80 మంది ప్రయాణికులను ఆస్ట్రేలియా చేర్చారు. విమానంలో బోర్డ్‌ అవ్వడానికి ముందే వీరంతా రెండు కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్లు చూపించారు. ఇక వీరందరిని హోవార్డ్‌ స్ప్రింగ్స్‌ ప్రాంతంలో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నారు. 

ఈ సందర్భంగా ఆస్ట్రేలియా కోశాధికారి జోశ్‌ ఫ్రైడెన్‌బర్గ్‌ మాట్లాడుతూ.. ‘‘వైద్యుల సూచనలు పాటిస్తూ.. ఇక్కడి పౌరులను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇండియా నుంచి మొదటి విమానం వచ్చిందని తెలపడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఇక వీరంతా ఆస్ట్రేలియా చేరడానికి ముందే వారికి పరీక్షలు నిర్వహించడం చాలా ముఖ్యం. మేం ఇదే అనుసరిస్తున్నాం. ఈ నెలలో మరో రెండు రాయల్‌ ఆస్ట్రేలియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ విమానాలు మా పౌరులను స్వదేశానికి తీసుకురానున్నాయి. జూన్‌ వరకు 1,000 మంది స్వదేశానికి చేరుకోవాలని భావిస్తున్నారు’’ అని తెలిపారు.

‘‘మా ప్రభుత్వం డార్విన్ నగరానికి ఆగ్నేయంగా 25 కి.మీ (16 మైళ్ళు) దూరాన ఉన్న హోవార్డ్ స్ప్రింగ్స్‌లోని క్వారంటైన్‌ సెంటర్‌ సామార్థ్యాన్ని రెంటింపు చేయాలని నిర్ణయించుకుంది. ఫలితంగా జూన్‌లో ప్రతి రెండు వారాలకు సుమారు 2,000 మందిని ఆస్ట్రేలియా చేర్చనున్నాం’’ అన్నారు. ఇక భారత్‌ నుంచి దాదాపు 9 వేల మంది ఆస్ట్రేలి యాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

చదవండి: భారత్‌పై నిషేధం: నిర్మోహమాటంగా కోర్టు నిరాకరణ

మరిన్ని వార్తలు