అమెరికాలో కాల్పుల కలకలం.. ఆర్నెళ్ల చిన్నారి సహా ఆరుగురి మృతి..

17 Jan, 2023 11:16 IST|Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆరు నెలల శిశువుతో సహా ఆరుగురు మరణించారు. ఈ ఘటన కాలిఫోర్నియాలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సెంట్రల్‌ కాలిఫోర్నియాలోని విసాలియా నగరంలో ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరు నెలల చిన్నారి, ఆమె తల్లి(17) సహా ఆరుగురు మృత్యువాత పడ్డారు. 

సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు వ్యక్తులకు కాల్పులకు తెగబడినట్లు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. విసాలియాకు తూర్పున ఉన్న ఇన్‌కార్పొరేటెడ్ గోషెన్‌లో నివాసముంటున్న కుటుంబంపై ఉదయం 3:30 గంటలకు ఇద్దరు వ్యక్తులు అనేకసార్లు కాల్పులు జరిపినట్లు తమకు సమాచారం అందిందని తులారే కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారులు తెలిపారు. 

ఇద్దరిని వీధిలో, మరో వ్యక్తి ఇంటి గుమ్మం వద్ద కాల్చి చంపినట్లు గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరో ముగ్గురు బాధితులు ఇంటి లోపల విగతా జీవిలుగా కనిపించారని తెలిపారు. వారిలో ఒకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా, ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తుండగా మరణించారని పేర్కొన్నారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు అనుమానితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. అయితే ఈ హత్యలకు ముఠాలతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నట్లు, ఈ కాల్పులు యాధృచ్చికంగా జరిపినవి కాదని, కుటుంబాన్ని టార్గెట్‌ చేసి పక్కా ప్లాన్‌ ప్రకారం హత్య చేసి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. 

అయితే మాదక ద్రవ్యాలు నిల్వ ఉన్న అనుమానంతో గతవారం క్రితం ఆ నివాసంలో షెరీఫ్‌ అధికారులు నార్కోటిక్స్ సంబంధిత తనిఖీలు చేశారు.  తనిఖీలు జరిపిన వారంరోజుల అనంతరం ఆ ఇంటిపై గుర్తుతెలియని ముఠా సభ్యులు దాడి చేశారు. కాల్పుల సమయంలో మరో ఇద్దరు వారికంటపడకుండా జాగ్రత్త పడటంతో ప్రాణాలతో బయటపడ్డారు.

మరిన్ని వార్తలు