బంగ్లాదేశ్‌లో 7 రోజుల లాక్‌డౌన్‌

4 Apr, 2021 05:30 IST|Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 7 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించనున్నట్లు బంగ్లాదేశ్‌ వెల్లడించింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు సోమవారం నుంచి ఏడు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు రోడ్లు, రవాణా మంత్రి ఒబైదుల్‌ ఖాదర్‌ చెప్పారు. అత్యవసర సర్వీసులు, పరిశ్రమలను లాక్‌డౌన్‌ నుంచి మినహాయిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ పని చేసుకోవచ్చని తెలిపారు. బంగ్లాదేశ్‌లో శుక్రవారం ఏకంగా 6,830 కొత్త కరోనా కేసులు బయట పడ్డాయి. దీంతో పాటు 50 మరణాలు సంభవించడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది.

ఇటలీలో మూడు రోజుల లాక్‌డౌన్‌
రోమ్‌: ఈస్టర్‌ సందర్భంగా కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు ఇటలీ మూడురోజుల కఠిన లాక్‌డౌన్‌ను ప్రకటించింది. సోమవారం వరకు దేశంలోని అన్ని ప్రాంతాలను రెడ్‌జోన్‌గా గుర్తించి లాక్‌డౌన్‌ అమలు చేస్తామని ఇటలీ ఆరోగ్యమంత్రి చెప్పారు. దేశంలో  కరోనా వ్యాప్తి తగ్గుతున్నా, పండుగ వేళ ఒక్కమారుగా మహమ్మారి విజృంభించకుండా ఈ జాగ్రత్త తీసుకున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌లో భాగంగా వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలుంటాయి. అత్యవసరాలు కాని షాపులు మూసివేస్తారు. రెస్టారెంట్లు, బార్లు కేవలం టేక్‌ అవేకు మాత్రమే పరిమితం అవుతాయి. లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేసేందుకు అదనపు బలగాలను మోహరించారు. యూరప్‌లో బిట్రన్‌ తర్వాత ఇటలీలో అధిక మరణాలు కరోనా కారణంగా సంభవించాయి. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నడుస్తోంది.   

మరిన్ని వార్తలు