ఢాకా: బంగ్లాదేశ్ స్వతంత్య్ర స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ఢాకా వచ్చిన భారత రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్కు బుధవారం ఘనస్వాగతం లభించింది. మూడురోజుల ఈ పర్యటనలో ఆయన బంగ్లా ప్రెసిడెంట్తో చర్చలు జరపనున్నారు. రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్తో పాటు ఆయన సతీమణి, కూతురు, ఇతర అధికారులు బంగ్లా పర్యటనకు వచ్చారు. కోవింద్కు 21 తుపాకుల సెల్యూట్తో బంగ్లా ఆర్మీ స్వాగతం పలికింది. ఆ దేశ అధ్యక్షుడు సతీసమేతంగా విమానాశ్రయానికి వచ్చి కోవింద్కు ఆహా్వనం పలికారు. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లా విముక్తి పొందింది.
చదవండి: మంత్రి మిశ్రా రాజీనామా ప్రసక్తే లేదు: బీజేపీ
బంగ్లా విముక్తి యుద్ధంలో అసువులు బాసిన వీరులకు కోవింద్ నివాళులర్పించారు. అనంతరం ఆయన ముజిబుర్ రహ్మన్ మ్యూజియంను దర్శించారు. కోవిడ్ కల్లోలం తర్వాత రాష్ట్రపతి జరుపుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. డిసెంబర్ 16న కోవింద్ గౌరవార్ధం నేషనల్ పెరేడ్ గ్రౌండ్లో గెస్ట్ ఆఫ్ ఆనర్ నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని హసీనాతో రాష్ట్రపతి చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సహా పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించారు.