రాణి బొమ్మతో ఉన్న కరెన్సీ నోట్లు ఇక చెల్లవా? వాటి విలువెంతంటే..

13 Sep, 2022 13:06 IST|Sakshi

లండన్‌: బ్రిటిష్‌ కరెన్సీ నోట్లపై క్వీన్‌ ఎలిజబెత్‌-2 బొమ్మ ఇంతకాలం ఒక హుందాగా ఉండిపోయింది. నోట్లే కాదు.. నాణేలు, పోస్టల్‌ స్టాంపులుగా యూకేవ్యాప్తంగా అధికారికంగా చెలామణిలో ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు.. పాస్‌పోర్ట్‌, ఇతర డాక్యుమెంట్లలోనూ రాజముద్ర కనిపించేంది. అయితే.. ఆమె మరణంతో ఇప్పుడు పరిస్థితి ఏంటన్న దానిపై అక్కడ జనాల్లో ఒక గందరగోళం నెలకొంది. కరెన్సీ నోట్లపై ఇక నుంచి ఆమె చిత్రాన్ని ముద్రిస్తారా? రద్దు చేస్తారా? చేస్తే తమ దగ్గరున్న కరెన్సీ మాటేంటని ఆరాలు తీస్తున్నారు. 

ఈ తరుణంలో.. యూకే కేంద్ర బ్యాంక్‌ ‘బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌’ సమాధానం ఇచ్చింది. బ్యాంక్‌ నోట్లతో పాటు రాణి ముఖచిత్రం ఉన్న కాయిన్లు ప్రస్తుతానికి చెల్లుతాయని స్పష్టత ఇచ్చింది. అంతేకాదు.. సంతాప దినాలు ముగిశాక బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ బ్యాంక్, నోట్ల విషయంలో మరో ప్రకటన చేయనుంది. అయితే ప్రస్తుతానికి కరెన్సీ చెల్లుబాటు అయినా.. కరెన్సీ నోటుపై రాణి చిత్రాన్ని తప్పనిసరిగా మార్చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇదిలా ఉంటే.. నేషన్స్‌ బ్యాంక్‌ నుంచి కరెన్సీ నోట్స్‌, రాయల్‌ మింట్‌ నుంచి కాయిన్స్‌ ముద్ర అవుతాయి అక్కడ. ఇంగ్లాండ్‌లో బ్యాంక్‌ నోట్లపై చిత్రం ప్రచురితమన మొదటి రాణిగా ఎలిజబెత్‌కు గుర్తింపు దక్కింది. కానీ స్కాటిష్‌,నార్త్ ఐరిష్ బ్యాంకు నోట్ల‌పై మాత్రం ఆ రాణి బొమ్మ ఉండ‌దు.  ఆమె వారసుడిగా రాజ్యాధికారం దక్కించుకున్న రాజు ఛార్లెస్‌-3 చిత్రాలను కరెన్సీ నోట్లు, కాయిన్లపై భర్తీ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ ముందు ఇప్పుడు పెద్ద పనే ఉంది.  

రాజు బొమ్మతో ఉన్న నోట్లు, కాయిన్లు ముద్రించాల్సి ఉంటుంది బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌. యూకే వ్యాప్తంగా రాణి చిత్రం ఉన్న దాదాపు 95 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు(ఒక బిలియన్‌ డాలర్లు అంటే.. ఏడున్నర వేల కోట్ల రూపాయలకు పైనే విలువ)తో కూడిన కరెన్సీనోట్లు, 29 బిలియన్ల నాణేలు ఉన్నట్లు యూకే కేంద్ర బ్యాంక్‌ చెబుతోంది. రాణి బొమ్మలతో ఉన్న నోట్లు, కాయిన్లు క్రమక్రమంగా కనుమరుగై.. రాజు బొమ్మతో కొత్తగా రానున్నాయి. 

రాజు బొమ్మతో ఎలాగంటే..

కింగ్‌ ఛార్లెస్‌-3 బొమ్మతో ఉన్న కాయిన్లు, కరెన్సీ నోట్లపై ఇప్పటి నుంచే కసరత్తులు మొదలయ్యాయి. కరెన్సీ నోట్ల సంగతి మాటేమోగానీ.. నాణేలపై రాజవంశస్తుల బొమ్మల్ని 17వ శతాబ్దం నుంచి ముద్రిస్తున్నారు. కింగ్‌ ఛార్లెస్‌-2 హయాం నుంచి ఇది మొదలైంది. సాధారణంగా.. ఒక తరం వాళ్ల బొమ్మను కుడి వైపు, మరో తరంవాళ్లను ఎడమవైపు ముద్రిస్తూ వస్తున్నారు. ఎలిజబెత్‌ రాణి బొమ్మ కాయిన్లకు కుడివైపు ఉండేది. కాబట్టి, ఛార్లెస్‌ బొమ్మను ఎడమవైపే ముద్రించడం ఖాయమైంది. ఇక పాస్‌పోర్ట్‌, ఇతర డాక్యుమెంట్లు పని చేసినా.. అందులో రాణికి సంబంధించిన ప్రస్తావన బదులు, రాజుకు సంబంధించిందిగా మారనుంది.

ఇదీ చదవండి: బ్రిటన్‌ పార్లమెంట్‌లో కింగ్‌ చార్లెస్‌–3 తొలి ప్రసంగం

మరిన్ని వార్తలు