భారత్‌,అమెరికా.. సబ్సే అచ్చే దోస్త్.. ట్రంప్ వ్యాఖ్యలు వైరల్‌..

11 Sep, 2022 10:24 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత్, అమెరికా మధ్య సంబంధాలను సరికొత్త పదంతో నిర్వచించారు అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'భారత్‌ అండ్ అమెరికా సబ్సే అచ్చే దోస్త్‌'(అన్నింటికంటే మంచి మిత్రదేశాలు) అని అన్నారు. ఈ ఇంటర్వ్యూ ఇంకా ప్రసారం కాకపోయినా ఇందుకు సంబంధించిన క్లిప్ లీక్ అయి వైరల్ అవుతోంది.

అయితే ట్రంప్‌ భారత్‌తో సంబంధాలపై ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక బలమైన కారణం ఉండే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ బరిలోకి దిగుతారని, అందుకే భారతీయుల పట్ల అత్యంత సానుకూలంగా ఉంటున్నారని పేర్కొన్నారు.

ప్రధాని మోదీకి, ట్రంప్‌కు మధ్య మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. 2019లో మోదీ రెండోసారి భారత ప్రధానిగా ఎన్నికైన అనంతరం ఇద్దరూ కలిసి అమెరికా హ్యూస్టన్‌లో 'హౌదీ మోదీ' పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భారత సంతతి వ్యక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ 'ఆప్‌కీ బార్ ట్రంప్ సర్కార్‌' అని ట్రంప్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 

ఆ తర్వాత 2020లో కరోనా సంక్షోభానికి ముందు ట్రంప్ భారత పర్యటనకు వచ్చారు. గజరాత్‌లో ఇద్దరు నిర్వహించిన రోడ్‌ షోకు దాదాపు లక్ష మంది జనం తరలివచ్చారు. అనంతరం ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్‌లోని  సర్దార్ పటేల్ స్టేడియంలో భారీ ర్యాలీలో పాల్గొన్నారు.
చదవండి: బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల విలువ తెలుసా?

మరిన్ని వార్తలు