అమెరికాలో గాంధీ విగ్రహ ధ్వంసంపై భారత్‌ ఆగ్రహం

30 Jan, 2021 12:40 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికాకు బహుమానంగా ఇచ్చిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం కూల్చివేయడంపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. గాంధీ విగ్రహం ధ్వంసం ఘటనను ఖండించింది. ఇది హేయమైన చర్య అని తెలిపింది. బాధ్యులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. అమెరికాలో డేవిస్‌ పట్టణంలో జనవరి 27వ తేదీన కొందరు దుండగులు గాంధీ విగ్రహాన్ని కూల్చివేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. 

అంతర్జాతీయంగా శాంతి, సమానత్వానికి ప్రతీకగా ఉన్న గాంధీ విగ్రహం కూల్చివేత హేయమైనదని భారత్‌ పేర్కొంది. దీనిపై అమెరికా ప్రభుత్వం కూడా స్పందించింది. భారత రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు చేస్తున్నామని వెంటనే చర్యలు తీసుకుంటామని డేవిస్‌ మేయర్‌ ప్రకటించారు. కాగా,  2016లో  ఆరడుగుల ఎత్తు, 4 అంగుళాల వెడల్పు, 294 కిలోల బరువున్న గాంధీ కాంస్య విగ్రహాన్ని భారత్ అమెరికాకు‌ బహుమతిగా ఇచ్చింది. కాలిఫోర్నియా రాష్ట్రం డేవిస్‌ పట్టణంలోని సెంట్రల్‌ పార్క్‌లో దీనిని ప్రతిష్టించారు. ఇక నేడు మహాత్మాగాంధీ వర్ధంతి అని తెలిసిందే.

మరిన్ని వార్తలు