డోక్లాంలో చైనా గ్రామం.. ఖండించిన భూటాన్

20 Nov, 2020 13:19 IST|Sakshi

న్యూఢిల్లీ : తమ భూభాగంలో చైనా ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసిందంటూ వస్తోన్న వార్తల్ని భూటాన్‌ ఖండించింది. అలాంటిది ఏం జరగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత భూటాన్ రాయబారి మేజర్ జనరల్ వెట్సాప్ నామ్‌గైల్‌ ‘మా భూభాగంలో చైనా గ్రామం ఏర్పాటు చేయడం వంటి చర్యలు ఏం జరగలేదు’ అని స్పష్టం చేశారు. ‘చైనా, భూటాన్ ప్రాదేశిక ప్రాంతంలోకి రెండు కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి ఓ గ్రామాన్ని ఏర్పాటుచేసింది’ అంటూ చైనాకు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ షెన్‌ షివే ట్వీట్‌ చేశారు. దీనిపై భారత్‌ భూటాన్‌ రాయబారి స్పందించారు. ‘నేను ఆ ట్వీట్‌ని చూశాను. ఓ జర్నలిస్ట్‌ చేసిన ట్వీట్‌ అది. ఇలాంటి ఊహాగానాల గురించి నేను పట్టించుకోను’ అన్నారు. ఇక చైనా తాజాగా ఏర్పాటు చేసినట్లు పేర్కొంటున్న గ్రామం మూడేళ్ల కిందట భారత్-చైనా సైన్యాలు ఘర్షణ పడిన డోక్లామ్‌కి సమీపంలోనే ఉండటం గమనార్హం. 

చైనా మీడియా సీజీటీఎన్ న్యూస్‌లోని సీనియర్ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వహిస్తోన్న షెన్ షివే ట్విట్టర్‌లో ‘ఇప్పుడు కొత్తగా స్థాపించబడిన పాంగ్డా గ్రామంలో శాశ్వత నివాసితులు నివసిస్తున్నారు. ఇది యాడోంగ్ కౌంటీకి దక్షిణాన 35 కిలోమీటర్ల దూరంలో లోయ వెంబడి ఉంది. డోక్లాం ప్రాంతం పరిష్కారం తరువాత ఖచ్చితమైన స్థానాన్ని సూచించింది’ అంటూ దీనికి సంబంధించిన ఫోటోలని ట్వీట్‌ చేశారు. అయితే, తర్వాత దాన్ని తొలగించారు. షెన్ షివే చేసిన ట్వీట్‌ను భారత్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు రీట్వీట్‌ చేశారు. ‘భూటాన్ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందనడానికి ఇదే సాక్ష్యం’ అని తెలిపారు. ‘భారత్-చైనాల మధ్య కొనసాగిన డోక్లాం వివాదాస్పద ప్రాంతానికి 9 కిలోమీటర్ల దూరంలో ఇది ఉందని చైనా జర్నలిస్ట్ షేర్ చేసిన మ్యాప్‌ను బట్టి అర్ధమవుతుంది’ అన్నారు. అంతేకాదు, భూటాన్ భూభాగంలో రెండు కిలోమీటర్ల చొచ్చుకొచ్చినట్టు తెలియజేస్తుందని పేర్కొన్నారు. (చదవండి: సరిహద్దులో చైనా కొత్త ఎత్తుగడ)

చైనా ‘ఐదు వేళ్ల’ వ్యూహం
సరిహద్దు భూభాగాలపై కన్నేసిన చైనా వాటిని ఆక్రమిచుకోవడానికి ‘ఐదు వేళ్ల’ వ్యూహాన్ని అమలు చేస్తోది. దానిలో భాగంగా టిబెట్‌ని కుడి చేతి అరచేయిగా భావించగా.. లద్దాఖ్‌, నేపాల్‌, సిక్కిం, భూటాన్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లని ఐదు వేళ్లలాగా భావిస్తోంది. ఇక బీజింగ్‌ ‘సలామి స్లైసింగ్’‌ వ్యూహాన్ని తాజాగా నేపాల్‌లో అమలు చేసి చేసింది. దానిలో భాగాంగా నేపాల్‌ భూభాగాన్ని డ్రాగన్‌ దేశం ఆక్రమించినట్లు సమాచారం. న్యూఢిల్లీ-ఖట్మాండ్‌ల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన సమయంలో డ్రాగన్‌ ఈ దుశ్చర్యకు పూనుకున్నట్లు తెలిసింది. ఇక ఈ చర్యలని ఉద్దేశిస్తూ ‘మావో కలని నిజం చేయడానికి జిన్‌పింగ్‌ కృషి చేస్తున్నాడని’ చైనా మీడియా ప్రశంసిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే భారత్‌ 17,000 అడుగుల ఎత్తులో లిపులేఖ్ ప్రాంతంలో రహదారి నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. దీని వల్ల కైలాస్‌ మానససరోవర యాత్రికులకు ప్రయాణ సమయం కలిసి వస్తుంది. (చదవండి: తప్పు ఒప్పుకున్న ట్విట్టర్ )

మరిన్ని వార్తలు