నిధులపై తాలిబన్ల ఆశలు ఆవిరి

12 Feb, 2022 04:39 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో స్తంభించిన అఫ్గాన్‌ కేంద్ర బ్యాంకు నిధులను తమకు అప్పగించాలన్న తాలిబన్ల ఆశలపై అమెరికా నీళ్లుజల్లింది. దాదాపు 700 కోట్ల డాలర్ల ఈ నిధులను అఫ్గాన్‌లో మానవీయ సాయానికి, 2001 బాధితులకు పరిహారానికి వినియోగించాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఆదేశాలిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో త్వరలో అధ్యక్షుడు బ్యాంకులకు ఆదేశాలిస్తారని, దీంతో యూఎస్‌ ఫైనాన్స్‌ సంస్థలు ఈ నిధులను విడుదల చేస్తాయని సంబంధిత అధికారులు చెప్పారు. వీటిలో 350 కోట్ల డాలర్లను అఫ్గాన్‌లో సహాయానికి కేటాయిస్తారని, 350 కోట్ల డాలర్లను అమెరికా వద్దే ఉంచుకొని ఉగ్రవాద దాడుల బాధితులకు అందిస్తారని చెప్పారు.

గతంలో అమెరికా సహా పలు దేశాలు అఫ్గాన్‌కు సాయం కోసం కోట్లాది డాలర్ల నిధులను అందించాయి. వీటిని అఫ్గాన్‌ కేంద్రబ్యాంకు అమెరికా బ్యాంకుల్లో దాచింది. తాలిబన్లు దేశాన్ని వశం చేసుకున్నప్పటినుంచి ఈ నిధులు తమకు అప్పగించాలని కోరుతున్నారు. అయితే తాలిబన్లు అధికారంలోకి వచ్చాక ఈ నిధులను అమెరికా స్తంభింపజేసింది. అమెరికాలో ఉన్న 700 కోట్ల డాలర్లు కాకుండా మరో 200 కోట్ల డాలర్ల అఫ్గాన్‌ నిధులు జర్మనీ, యూఏఈ, స్విట్జర్లాండ్, ఖతార్‌లో ఉన్నాయి. అమెరికా తాజా నిర్ణయాన్ని తాలిబన్లు వ్యతిరేకిస్తారని  అంచనా.  వీరి ప్రతిస్పందన ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు