సిరియాలో సైన్యం లక్ష్యంగా బస్‌ బాంబు పేలుడు

21 Oct, 2021 05:25 IST|Sakshi

14 మంది సైనికుల దుర్మరణం

డమాస్కస్‌: సిరియా సైనికులను లక్ష్యంగా చేసుకుని జరిగిన బస్‌ బాంబు దాడిలో 14 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సిరియా రాజధాని నగరం డమాస్కస్‌లో బుధవారం ఈ దాడి జరిగింది. బుధవారం ఉదయం రద్దీ సమయంలో డమాస్కస్‌లోని ఒక జంక్షన్‌ వద్ద ఈ పేలుడు జరిగింది. సిరియా సైనికులు ప్రయాణిస్తున్న ఒక బస్‌కు ముందుగానే ఆగంతకులు రెండు శక్తివంతమైన బాంబులను అమర్చారు. సైనికులతో బస్సు కదులుతుండగా ఆ బాంబులను పేల్చేశారు.

ఈ ఘటనలో 14 మంది సైనికులు మరణించారు. సిరియా అధ్యక్షుడు బషర్‌–అల్‌–అస్సద్‌ పాలనను తీవ్రంగా వ్యతిరేకించే విపక్ష సాయుధ కూటములు, జిహాదీ సంస్థలు ఈ దాడికి పాల్పడి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసద్‌ ప్రభుత్వ వ్యతిరేక శక్తుల అధీనంలోని ప్రాంతంలో సైన్యం జరిపిన దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌లోని ఓ పట్టణంపై సైన్యం జరిపిన వైమానిక దాడిలో ఎనిమిది మంది చిన్నారులు, ఒక ఉపాధ్యాయురాలు, ఒక మహిళ చనిపోయారు.

మరిన్ని వార్తలు