భర్త చనిపోయాడని ప్రకటించిన వైద్యులు.. సీటీ స్కాన్‌లో షాకింగ్ నిజాలు..

6 Sep, 2022 14:05 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా నార్త్ కరోలినాలో అనూహ్య ఘటన జరిగింది. డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన ఓ వ్యక్తి ఆశ్చర్యకర రీతిలో కాళ్లు కదిపాడు. దీంతో వైద్యులు మారోమారు పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగుచుశాయి. అతని బ్రెయిన్ యాక్టివ్‌లోనే ఉన్నట్లు తెలిసి వైద్యులు నమ్మలేకపోయారు. వెంటనే అతనికి మళ్లీ చికిత్స ప్రారంభించారు.

విల్క్స్ కౌంటీకి చెందిన ఈ వ్యక్తి పేరు ర్యాన్ మార్లో. పాస్టర్‌గా పని చేస్తున్నాడు. బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌తో వచ్చే అరుదైన లిస్టేరియా వ్యాధి బారినపడ్డాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు రెండు వారాల పాటు చికిత్స అందించారు. అనంతరం ఇన్‌ఫెక్షన్‌ వల్ల అతని మెదుడులో వాపు వచ్చిందని, బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు ప్రకటించారు. వైద్యపరంగా చెప్పాలంటే మరణించినట్లే అని పేర్కొన్నారు. తన భర్త పరిస్థితిని మేగన్ సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలిపింది. 

తాను అవయవ దానం చేస్తానని ర్యానో గతంలోనే నమోదు చేసుకున్నాడు. దీంతో అతన్ని లైఫ్‌ సపోర్టుపై ఉంచారు వైద్యులు. అతని అవయవాలు పొందేందుకు సరైన రోగుల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఆగస్టు 30న ర్యాన్‌కు అంతిమ వీడ్కోలు చెప్పేందుకు అందరూ సిద్ధమవుతుండగా.. మేగన్‌ కోడలు ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించింది. ర్యాన్ కాళ్లు కదిపారని, అది ఫోన్లో తీసిన వీడియోలో రికార్డయ్యిందని చెప్పింది.

మళ్లీ పరీక్షలు..
వెంటనే మేగన్ వైద్యుల దగ్గరికి వెళ్లి తన భర్త బ్రెయిన్ పనితీరుపై మరోమారు పరీక్షలు చేయాలని కోరారు. ఆమె విజ్ఞప్తి మేరకు సీటీ స్కాన్ తీసిన వైద్యులు అవాక్కయ్యారు. ర్యాన్ బ్రెయిన్ యాక్టివ్‌లోనే ఉన్నట్లు అందులో తేలింది. దీంతో పొరపాటుగా వాళ్లు బ్రెయిన్‌ డెడ్‌గా ప్రకటించినట్లు స్పష్టమైంది.

స్కాన్ రిపోర్టుల అనంతరం మేగన్ మళ్లీ సోషల్ మీడియాలో తన భర్త పరిస్థితి గురించి వెల్లడించింది. ర్యాన్‌కు బ్రెయిన్ డెడ్ కాలేదని చెప్పింది. దేవుడే తనను బతికించాడని పేర్కొంది. రీస్కాన్ తర్వాత ర్యాన్ హార్ట్‌బీట్‌ కొంచెం పెరిగింది. అయితే వైద్యుల చికిత్సకు స్పందనలో మాత్రం మార్పు లేదని మేగన్ చెప్పింది. ర్యాన్‌ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని పేర్కొంది.

చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధం.. కొరియా కిమ్‌తో చేతులు కలిపిన పుతిన్‌!

మరిన్ని వార్తలు