బ్రెజిల్‌లో మరణ మృదంగం

5 Mar, 2021 04:21 IST|Sakshi

రోజుకి 2 వేల మరణాలు నమోదు

కోవిడ్‌ మరణాల్లో ప్రపంచంలోనే రెండో స్థానం

బ్రెజీలియా: బ్రెజిల్‌లో కోవిడ్‌ –19 విలయతాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. రోజుకి సగటున 2 వేల మంది ప్రాణాలను కరోనా బలి తీసుకుంటోంది. ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత అత్యధిక మరణాలు నమోదైంది బ్రెజిల్‌లోనే. ఇప్పటివరకు 2,59,271 మరణాలతో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉన్నట్టుగా వరల్డో మీటర్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో కరోనా ఈ స్థాయిలో విజృంభిస్తుందని ఊహించలేదని బ్రెజిల్‌ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

మొదట్నుంచి నిర్లక్ష్యమే: కరోనాని కట్టడి చేయడంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో మొదట్నుంచి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కరోనా వైరస్‌ని తగ్గించి చూపించే ప్రయత్నం చేశారు. మాస్కులు తప్పనిసరి చేయలేదు. లాక్‌డౌన్‌ విధించడానికి ఇష్టపడలేదు. ప్రజలు కూడా కరోనా గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కోవిడ్‌ కేసులు, మరణాలు భారీగా పెరిగాయి.  ఆస్పత్రులు కరోనా రోగులతో కిటకిటలాడిపోతున్నాయి.  బ్రెజిల్‌లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కూడా  నెమ్మదిగా సాగుతోంది. చైనా తయారీ కరోనావాక్, ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లను ఇస్తోంది. ఇప్పటివరకు 71 లక్షల మందికి ఒక్క డోసు, 21 లక్షల మందికి రెండు డోసులు ఇచ్చింది. కేసుల తీవ్రతకి అమెజాన్‌ అడవులు బాగా విస్తరించిన మానస్‌ నగరం నుంచి నుంచి వచ్చిన కరోనా కొత్త స్ట్రెయిన్‌ పీ1 కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు