అనూహ్యంగా పెరిగిన కరోనా కేసులు

22 Dec, 2020 16:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లండన్‌ : బ్రిటన్‌లో కొత్త రకం కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. వారం రోజుల్లోనే కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. రోజు వారిగా వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య 64.7 శాతానికి చేరుకుంది. గత సోమవారం వైరస్‌ బారిన పడుతున్న రోజువారి ప్రజల సరాసరి సంఖ్య 20 వేలు ఉండగా, అది నేటికి 33,500కు చేరుకుంది. మృతుల సంఖ్య 7.3 శాతంతో కొనసాగుతుండడం, కేసులు పెరిగిన స్థాయిలో మృతుల సంఖ్య పెరగక పోవడం ఉపశమనం కలిగించే అంశం.

పొంచి ఉన్న ప్రమాదాన్ని అంచనా వేసిన బ్రిటన్‌ ప్రధాని శనివారం రాత్రి సంచలన ప్రకటన చేశారు. లండన్, సౌత్‌ ఈస్ట్‌లో నివసిస్తోన్న 1.60 కోట్ల మంది ప్రజలకు క్రిస్మస్‌ వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దుకాణాలు, జిమ్ములు, బార్బర్‌ షాపులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఫోర్‌ టైర్‌ ప్రాంతాల ప్రజలకు పిలుపునిచ్చారు. క్రిస్మస్‌ తర్వాత కూడా కఠిన ఆంక్షలు కొనసాగే అవకాశం ఉన్నట్లు బ్రిటన్‌ ఆరోగ్య శాఖ ప్రకటించింది. వసంత రుతువు వెళ్లే వరకు కఠిన ఆంక్షలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని లాక్‌డౌన్‌ ప్రొఫెసర్‌ నీల్‌ ఫెర్గూసన్‌ సూచించారు. (చదవండి: భారత్‌ బాటలోనే పలు ప్రపంచ దేశాలు)


భారత్‌లో తగ్గిన కరోనా కేసులు
భారత్‌లో కొత్తగా 19,556 కరోనా కేసులు నమోదు కాదా, 301 మరణాలు సంభవించాయి. జూలై నుంచి ఇంత తక్కువ స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం గమనార్హం. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి 75వేల 116  చేరగా, ఇప్పటివరకు 96 లక్షల 36వేల 487 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 1,46,111 మంది మృతి చెందగా, ప్రస్తుతం దేశంలో 2,92,518 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మరిన్ని వార్తలు