Ancient Iraqi City Mystery: నదిలో బయటపడ్డ రహస్యం...పెద్ద చరిత్రే ఉందంటున్న పురావస్తు శాఖ

6 Jun, 2022 15:23 IST|Sakshi

నదుల్లోని నీటిని వినియోగించుకునేందుకు లేదా పంటలు పండించడానికో లేదా విద్యుత్‌ కోసం రిజర్వాయర్లు లేదా డ్యాంలను ప్రభుత్వం నిర్శిస్తుంటుంది. దీని వల్ల దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల పై ఆ కట్టడాలు బాగా ప్రభావం చూపిస్తాయి. అవి మునిగిపోవడం లేదా కనుమరుగైపోవడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే నైసర్గిక భూగోళ స్వరూపాన్ని మార్చేస్తాయి. ఈ డ్యాంలను నిర్మించడానికి భూమిని చాలా లోతుగా తవ్వి నిర్మిస్తుంటారు. దీంతో చుట్టూ ఉన్న పొలాలు, ఇళ్లు, ప్రాంతాలు ఆ నది ప్రవాహానికి ధ్వంసమైపోతుంటాయి. అచ్చం అలానే ఇక్కడొక నది పై నిర్మించిన రిజర్వాయర్‌ కారణంగా పురాతనమైన నగరం కనుమరుగైపోయింది. ప్రస్తుతం ఆ రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గడంతో బయటపడింది. ఎక్కడ జరిగింది? ఏంటా నగరం అనే కదా!.

వివరాల్లోకెళ్తే..కెమునేలోని కుర్దిస్థాన్ ప్రాంతంలో దాదాపు మూడు వేల ఏళ్ల నాటి పురాతన ఇరాక్‌ నగరం బయటపడింది. వాస్తవానికి టైగ్రిస్ నది పై నిర్మించిన రిజర్వాయర్‌లో నీటి స్థాయిలు తగ్గిపోవడంతో ఈ నగరం బయటపడింది. ఐతే ఇది కాంస్య యుగానికి చెందిన ఒక పురాతన సామ్రాజ్యం అని ఆర్కియాలజీ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఆర్కియాలజీ బృందంలోని డాక్టర్‌ ఇవానా పుల్జిజ్‌ ఈ నగరం నేరుగా ట్రెగ్రిస్‌ నదిపై ఉన్నందున మిట్టాని సామ్రాజ్యంలోని ప్రధాన ప్రాంతాలతో అనుసంధానించి ఉందని చెబుతున్నారు.

ఇరాక్‌ ప్రభుత్వం కూడాఈ రిజర్వాయర్‌ తిరిగి నిండిపోక ముందే తవ్వకాలు జరిపి ఆ నగరానికి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు జర్మన్‌కి చెందిన ఆర్కియాలజీ బృందానికి అనుమతిచ్చింది. ఈ మేరకు ఆర్కియాలజీ బృందం ఈ నగరానికి సంబంధించిన కొన్నిఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. క్రీస్తు పూర్వం 1550 నుంచి 1350లలో మిట్టని సామ్రాజ్యం పాలనలో ఈ పురాతన నగరం కీలక కేంద్రంగా ఉందని తెలిపింది. ఐతే ఆ రిజర్వాయర్‌లో మళ్లీ నీటి నిల్వలు పెరగడంతో  ఆ పురాతన ప్రదేశానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా తవ్విన భవనాలను ప్లాస్టిక్ షీటింగ్‌తో చుట్టి ఉంచారు. ప్రస్తుతం ఆ నగరం మరోసారి పూర్తిగా మునిగిపోయింది.

(చదవండి: 20 ఏళ్ల యువతికి 3డీ ప్రింటెడ్‌ చెవి)

మరిన్ని వార్తలు