ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. చైనా దిమ్మ తిరిగిపోయేలా నిర్ణయం

28 Nov, 2022 19:34 IST|Sakshi

ఒక దెబ్బకు రెండు పిట్టలు. డ్రాగన్‌ కంట్రీ దిమ్మ తిరిగిపోయేలా నిర్ణయం తీసుకుంది ఉత్తర అమెరికా దేశం కెనడా. ఈ మేరకు ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. 

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వాణిజ్య సంబంధాల బలోపేతం కోసం భారీగా వెచ్చించ్చనున్నట్లు కెనడా ప్రకటించింది. తద్వారా ఈ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని బాగా తగ్గించాలనే ఆలోచనలో కెనడా ఉన్నట్లు స్పష్టమవుతోంది.  అంతేకాదు.. ఈ ప్రభావంతో ఈ రీజియన్‌లో తమ బలాన్ని పెంచుకోవాలని కూడా భావిస్తోంది. ఈ మేరకు విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ఆదివారం ఉదయం కీలక ప్రకటన చేశారు. 

కెనడా తన పసిఫిక్ వాణిజ్య సంబంధాలను చైనాకు మించి విస్తరించడానికి చాలా కష్టపడుతోంది. ఈ క్రమంలో అమెరికా తర్వాత చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఇప్పుడు ఆ స్థానంపై కెనడా కన్నేసినట్లు స్పష్టమవుతోంది. తాజాగా ఇండో-పసిఫిక్ వ్యూహంలో భాగంగా కెనడా తరపున 1.7 బిలియన్‌ డాలర్ల ఖర్చు చేయబోతున్నట్లు మెలానీ జోలీ ప్రకటించారు. ఆ డబ్బును ఇండో-ఫసిఫిక్‌ రీజియన్‌లో మరింత నౌకాదళ గస్తీ కోసం, మెరుగైన నిఘా కోసం, సైబర్‌ సెక్యూరిటీ చర్యలకు ఉపయోగించనున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాదు.. తూర్పు-దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో ప్రాంతీయ భాగస్వాముల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. 

చైనా లక్ష్యంగా..
ఈ ప్రకటనకు ముందు ఆమె బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌తో గంటకు పైగా ఇంటర్వ్యూ ఇచ్చారు. యూరప్‌తో సుదీర్ఘకాలంగా తమ అనుబంధం కొనసాగుతోందని.. ఇక ఇప్పుడు ఫసిఫిక్‌పై దృష్టిసారించాల్సిన అవసరం వచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు.  తద్వారా చైనా తీరును ఖండిస్తూ.. ఆ దేశానికి వ్యతిరేకంగానే తమ చర్యలు ఉండబోతున్నాయంటూ ఇంటర్వ్యూలో దాదాపుగా మాట్లాడారామె.   అంతకు ముందు శుక్రవారం ఆమె మాంట్రియల్‌లో మాట్లాడుతూ.. ‘‘ చైనా విషయానికి వస్తే.. యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉందని మాకు తెలుసు. కాబట్టి మేము మా ఆటను కొనసాగిస్తాం’’ అంటూ ఆమె దూకుడు ప్రకటన చేశారు. 

ఇండోనేషియా బాలి జీ20 సదస్సు సందర్భంగా.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌-కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వాళ్ల మధ్య జరిగిన భేటీ సారాంశం మీడియాకు లీక్‌ కావడంపై జిన్‌పింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేయగా.. అందులో తప్పేం ఉందంటూ స్ట్రాంగ్‌కౌంటర్‌ ఇచ్చారు ట్రూడో.    

మరిన్ని వార్తలు