బహష్కరణ వేటును ఎదుర్కొంటున్న విద్యార్థులకు భరోసానిచ్చిన కెనడా ప్రధాని

9 Jun, 2023 08:16 IST|Sakshi

కెనడా: కెనడాలో బహిష్కరణ వేటుకు గురైన 700 మంది భారత విద్యార్థులకు భరోసానిచ్చారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. బహిష్కృత విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. ఇందులో వారి తప్పేమీ లేదు. వారిని మోసం చేసినవారిని పట్టించేందుకు తగిన సాక్ష్యాధారాలను వారు సిద్ధం చేసుకోవాలని చెప్పడంతో భారత విద్యార్థులకు కొంత ఉపశమనం లభించినట్టయ్యింది. 

పార్లమెంటులో బిల్లు ఆమోదం... 
కెనడాలో విద్యనభ్యసించి అక్కడే ఉద్యోగాల్లో చేరిన కొంత మంది విద్యార్థులు ఇటీవల శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోగా ఈ ఫేక్ ఆఫర్ లెటర్ల ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఫేక్ కసల్టెన్సీల చేతిలో మోసపోయిన సుమారుగా 700 మంది విద్యార్థులు తమ చేతిలో బహిష్కృత లెటర్లను పట్టుకుని కెనడా వీధుల్లోకి వచ్చారు. భారత విదేశాంగ శాఖ చొరవతో ఈ ప్రస్తావనను కెనడా పార్లమెంటరీ కమిటీలో ప్రవేశపెట్టగా వారంతా భారత విద్యార్థులకు ఏకగ్రీవంగా మద్దతు పలికారు. 

వెంటనే విద్యార్ధులపై బహిష్కరణను తొలగించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా కెనడా బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీకి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ సందర్బంగా ఫేక్ ఆఫర్ లెటర్లను ఇచ్చి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న కన్సల్టెన్సీలపై చర్యకు తీసుకోవాలన్న బిల్లును కూడా సభ ఆమోదించింది.  

కెనడా ప్రధాని హామీ.. 
అంతకుముందు భారత సంతతికి చెందిన ఎంపీ జగ్మీత్ సింగ్ ఎవరో స్వార్ధపరులు చేసినదానికి విద్యార్థులను శిక్షించడం సరికాదు. దీనిపై స్పందించమని కోరగా కెనడా ప్రధాని స్వయంగా మాట్లాడుతూ.. విద్యార్థుల బహిష్కరణ వేటు అంశం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూనే ఉన్నాను. విదేశాల నుండి వచ్చే విద్యార్థులు మా దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడుతున్నారు. బాధితులకు అండగా ఉంటామని అన్నారు.   

ఇది కూడా చదవండి: రష్యా నుంచి.. మరో ఎయిరిండియా విమానంలో తరలింపు

మరిన్ని వార్తలు