18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు.. ఆ డబ్బుతో ఏం చేసిందంటే..?

7 Feb, 2023 20:24 IST|Sakshi

కెనడా: అదృష్టం తలుపుతడితే ఒక్క రోజులో జీవితాలు మారిపోతాయ్ అంటారు. కెనడాకు చెందిన 18 ఏళ్ల జూలియెట్ లామర్‌కు సరిగ్గా ఇలానే జరిగింది. ఆమె రాత్రికిరాత్రే  కోటీశ్వరురాలు అయింది. పుట్టిన రోజు ముందు ఏం కొనాలో తెలియక.. తాతయ్య సూచన మేరకు లాటరీ కొనుగులు చేసిన ఆమెకు ఏకంగా రూ.290 కోట్ల జాక్‌పాట్ తగిలింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఒకేసారి ఇంతడబ్బు వస్తే ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితి ఉంటుంది. కానీ జూలియెట్ మాత్రం అప్పుడే రూ.150 కోట్లు ఖర్చు పెట్టేసింది. లాటరీ డబ్బు రాగానే తన కుటుంబం కోసం ఐదు మెర్సీడెస్ కార్లు కొనుగోలు చేసింది. దీని ధర ఒక్కోటి రూ.2కోట్లు ఉంటుంది. అలాగే రూ.40 కోట్లతో పెద్ద బంగ్లా సొంతం చేసుకుంది. మరో రూ.100 కోట్లు పెట్టి ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌కు యజమాని అయింది.  ఇక మిలిన డబ్బును మాత్రం భవిష్యత్ అవసరాల కోసం దాచుకుంది. అంతేకాదు తన తండ్రి సలహాలు సూచనలో ఈ డబ్బుతో పెట్టుబడులు కూడా పెడతానని చెబుతోంది.

జూలియెట్‌ ఇటీవలే తన 18వ పుట్టినరోజు జరుపుకొంది. ఈ సందర్భంగా ఏమైనా కొనుక్కుందాం అని దుకాణానికి వెళ్లింది. ఏం కొంటే బాగుంటుందని తన తాతయ్యను అడగ్గా.. లాటరీ కొనుగోలు చేయమని అతను సూచించాడు. దగ్గరుండి టికెట్ ఇప్పించాడు.

అయితే కొద్ది రోజుల తర్వాత లాటరీ విషయాన్ని జూలియెట్ మర్చిపోయింది. కానీ పక్కింటి వాళ్లు లాటరీలో డబ్బు గెలుచుకున్నారని తెలిసింది. దీంతో తన లాటరీ విషయం గుర్తుకువచ్చింది. వెంటనే మొబైల్ యాప్ ఓపెన్ చేసి చెక్‌ చేసుకుంది. తాను కొనుగోలు చేసిన టికెట్ నంబర్‌కు రూ.290 కోట్లు(48 మిలియన్లు) వచ్చాయని తెలిసి ఆనందంతో పాటు ఆశ్చర్యంలో మునిగిపోయింది.
చదవండి: భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్..

మరిన్ని వార్తలు