Cancer Traces In Egypt Mummy: ఆ మమ్మీకి అరుదైన కేన్సర్‌ ?

15 Jul, 2022 05:52 IST|Sakshi

వార్సా: రెండు వేల ఏళ్ల క్రితం నాటి ఈజిప్ట్‌ మమ్మీ అవశేషాల్లో ఒక అరుదైన కేన్సర్‌ ఆనవాళ్లు కనిపించాయి.  19వ శతాబ్దంలో ఈ మమ్మీని పరిశోధనల కోసం ఈజిప్టు నుంచి పోలండ్‌కు తీసుకువచ్చారు. అప్పుడే శాస్త్రవేత్తలు ఈ మమ్మీ గర్భిణిగా ఉన్నప్పుడే మరణించిందని నిర్ధారించారు. గర్భిణిగా ఉన్న ఒక ఈజిప్టు మమ్మీ లభించడం ప్రపంచంలో అదే తొలిసారి. ఆమెకు 20 ఏళ్ల వయసు ఉంటుందని, మరణించే సమయానికి 28 వారాల గర్భంతో ఉన్నట్టు తేలింది.

ఇప్పుడు ఈ అరుదైన కేన్సర్‌ గురించి వెలుగులోకి వచ్చింది. పోలండ్‌లోని వార్సా మమ్మీ ప్రాజెక్టుకి (డబ్ల్యూఎంపీ) చెందిన శాస్త్రవేత్తలు తాము చేస్తున్న అధ్యయనాల్లో భాగంగా ఆ మమ్మీ పుర్రెకి స్కానింగ్‌ తీయగా ఎముకల్లో కొన్ని గాయాల గుర్తులు కనిపించాయి. నేజోఫరెంజియో అనే అరుదైన కేన్సర్‌ సోకే రోగుల ఎముకల్లో ఇలాంటి గురుతులే ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ మమ్మీ అదే కేన్సర్‌తో మరణించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది ఒకరకమైన గొంతు కేన్సర్‌. ముక్కు వెనుక భాగం నుంచి నోటి వెనుక భాగాన్ని కలిపి ఉంచే భాగానికి ఈ కేన్సర్‌ సోకుతుంది. డబ్ల్యూఎంపీ ఈ పుర్రె భాగానికి చెందిన ఫోటోలను విడుదల చేసింది. అందులో ఎముకలపై కనిపించిన కొన్ని మార్కింగ్‌లను చూస్తే అవి కేన్సర్‌ వల్ల ఏర్పడినవని భావిస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు