ఇమ్రాన్‌తో బైడెన్‌ ఎప్పుడు మాట్లాడేదీ చెప్పలేం

29 Sep, 2021 07:24 IST|Sakshi

పాక్‌ ప్రధాని వ్యాఖ్యలకు వైట్‌హౌస్‌ స్పందన

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు తనతో మాట్లాడేందుకు కూడా తీరిక లేదంటూ పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై వైట్‌హౌస్‌ స్పందించింది. అధ్యక్షుడు బైడెన్, పాక్‌ ప్రధానితో ఎప్పుడు మాట్లాడేదీ తాము చెప్పలేమని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకి తెలిపారు. ‘రెండు దేశాల విదేశాంగ, రక్షణ శాఖల అధికారులతోపాటు బైడెన్‌ యంత్రాంగంలోని కీలక అధికారులు ఎప్పటికప్పుడు పాక్‌తో టచ్‌లో ఉంటున్నారు. ఇమ్రాన్‌తో బైడెన్‌ ఎప్పుడు మాట్లాడేదీ ముందుగా చెప్పలేం. ఒక వేళ సంభాషణ జరిగితే మేమే మీకు వెల్లడిస్తాం’ అని మీడియాతో అన్నారు.  చదవండి:  (కరోనా పూర్తి నిర్మూలన అసాధ్యం!)

జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బైడెన్‌ ఇప్పటి వరకు తనతో ఫోన్‌లో మాట్లాడకపోవడంపై ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర అసహనంతో ఉన్నారు. అమెరికా మీడియాకు ఇటీవల ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో ఇదే విషయమై అమెరికాపై, అధ్యక్షుడు బైడెన్‌పై విమర్శలు కురిపించారు. అఫ్గాన్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు అమెరికా ఒక వైపు తమ సాయం కోరుతున్నా.. అధ్యక్షుడు బైడెన్‌ మాత్రం తనతో మాట్లాడలేనంత బిజీగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. బైడెన్, భారత ప్రధాని మోదీ సమావేశం సమయంలో ఇమ్రాన్‌ ఐరాసలో చేసిన ప్రసంగంలోనూ ..అఫ్గాన్‌లో పరిణామాలకు అమెరికాతోపాటు కొన్ని యూరప్‌ దేశాల నేతలు తమనే వేలెత్తి చూపుతున్నారని ఆరోపించారు.  

మరిన్ని వార్తలు