వెలుగులోకి 100 ఏళ్లనాటి పావురాయి సందేశం

9 Nov, 2020 11:48 IST|Sakshi

పారిస్‌: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సందేశాలు చేరవేయడంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేయాలంటే మనుషులు వందల మైళ్లు ప్రయాణం చేసి అక్కడకి వెళ్లి సమాచారం తెలిపేవారుల. కానీ ప్రస్తుత కాలంలో కూర్చున్న చోట నుంచే సెకన్ల వ్యవధిలో ప్రపంచంలోని ఏ మూలకైనా మెసేజ్‌ని పంపగల్గుతున్నాం. ఈ మెయిల్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ఇంకా రకరకాల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఓ వందేళ్ల క్రితం సందేశాలు పంపాలంటే పావురాలే ప్రధాన ఆధారంగా ఉండేవి. అప్పటికి పోస్టు సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికి కీలక సమాచారాన్ని చేరవేయడం కోసం పావురాల మీద ఆధారపడేవారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే దాదాపు వందేళ్ల క్రితం అంటే మొదటి ప్రపంచ యుద్ధం నాటి పావురాయి సందేశం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తూర్పు ఫ్రాన్స్‌కు చెందిన ఓ జంట వాకింగ్‌ కోసం బయటకు వెళ్లారు. వారికి ఓ చిన్న క్యాప్సిల్స్‌ కనిపించింది. వింతగా ఉండటంతో దాన్ని తెరిచి చూశారు. (చదవండి: పాకిస్తాన్‌ పావురం విడుదల)

ఆశ్చర్యం.. అందులో ఓ చిన్న ఉత్తరం ఉంది. దాదాపు వందేళ్ల క్రితం ఓ ప్రష్యన్‌ సైనికుడు పావురం ద్వారా పంపిన సందేశం ఇది. కానీ దురదృష్టం కొద్ది అది తన గమ్యస్థానాన్ని చేరుకోలేకపోయింది. ఇక తూర్పు ఫ్రాన్స్‌లోని ఓర్బీలోని లింగే మ్యూజియం క్యూరేటర్ డొమినిక్ జార్డి మాట్లాడుతూ.. ‘ఇది మొదటి ప్రపంచ యుద్ధ (1914-10)కాలానికి చెందిన సందేశం. ఇంగర్‌షీమ్‌లోని ఒక పదాతిదళ సైనికుడు తన ఉన్నతాధికారిని ఉద్దేశిస్తూ జర్మన్‌ భాషలో స్వయంగా తన చేతితో రాసిన ఉత్తరం ఇది. దీనిలో అతడు కీలకమైన సైనిక విన్యాసాల గురించి వివరించాడు’ అని తెలిపారు. ప్రస్తుతం తూర్పు ఫ్రాన్స్‌లో భాగమైన ఇంగర్‌షీమ్‌‌ ఒకప్పుడు జర్మనీలో భాగంగా ఉండేది. ఇక ఈ ఉత్తరం ఈ ఏడాది సెప్టెంబర్‌లో సదరు దంపతుల చేతికి చిక్కింది. వారు దీన్ని జార్డికి అందించారు. అతడు ఓ జర్మన్‌ స్నేహితుడి సాయంతో ఈ మెసేజ్‌ని డీకోడ్‌ చేశాడు. ఇక ఈ ఉత్తరాన్ని అపూర్వమైనదిగా పేర్కొన్న జార్డి దాన్ని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాడు. 
 

మరిన్ని వార్తలు