చంద్ర గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావమెంతంటే..

8 Nov, 2022 09:11 IST|Sakshi

చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటాన్నే చంద్ర గ్రహణం అంటారు. ఈరోజు(నవంబరు8వ తేదీ) చంద్ర గ్రహణం ఏర్పడటంతో ఆ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు  ఆసక్తి కనబరిచే వారు కొందరైతే.. గ్రహణం కాబట్టి దాని ప్రభావం లేకుండా జాగ్రత్త పడేవారు మరి కొందరు.

ఏది ఏమైనా ఈ గ్రహణం ఏ సమయంలో సంభవించనుంది, ఏయే దేశాల్లో కనిపించనుందో చూద్దాం.  ఈ రోజు ఏర్పడే చంద్ర గ్రహణం ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా,  భారత్‌, ఫసిఫిక్‌, అట్లాంటిక్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించనుంది.  భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.19 గంటల వరకు గ్రహణం సంభవించనుండగా, అందులో సంపూర్ణ చంద్ర గ్రహణం 3.46 నుంచి సాయంత్రం 5.12 గంటల వరకు ఉంటుంది.

ఓవరాల్‌గా చూస్తే ఈ గ్రహణం ప్రక్రియ పూర్తవడానికి మొత్తం 3 గంటల 40 నిమిషాలు పట్టనుంది. భారత్‌లో చంద్ర గ్రహణం ఏర్పడే సమయం పగటి పూట కావడంతో అన్ని రాష్ట్రాల్లోనూ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉండదు.

కాగా, భారత్‌లో ఇటానగర్‌, గుహవాటి, సిలిగురి ప్రాంతాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం చూసే అవకాశం ఉండగా, కోల్‌కతా, భువనేశ్వర్‌, ఢిల్లీ, శ్రీనగర్‌, చెన్నై, గాంధీ నగర్‌, ముంబై వంటి ప్రాంతాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపించనుంది.  సాధారణంగా పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడే అవకాశాలు ఉండవు.  ఎందుకంటే పౌర్ణమి సందర్భంగా సూర్యుడు, భూమి, చంద్రుడు కచ్చితంగా ఒకే సరళ రేఖపైకి రావని నిపుణులు చెబుతున్నారు. భూమి కక్ష్య, చంద్రుని కక్ష్య పరస్పరం 5 డిగ్రీల కోణంలో వంగి ఉండడమే అందుకు కారణమని వారు విశ్లేషిస్తున్నారు.

మరిన్ని వార్తలు