నవంబర్‌ నాటికి చైనా వ్యాక్సిన్‌

16 Sep, 2020 03:24 IST|Sakshi

బీజింగ్‌: చైనా తయారు చేస్తోన్న కోవిడ్‌ వ్యాక్సిన్‌ నవంబర్‌ నాటికల్లా ప్రజలకు అందుబాటులోకి రానుందని చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) వెల్లడించింది. చైనాలో మానవప్రయోగ తుది దశలో ఉన్న నాలుగు కోవిడ్‌ వ్యాక్సిన్‌లలో మూడింటిని ఇప్పటికే అత్యవసర కార్యక్రమం కింద, అత్యవసర సిబ్బందికి ఉపయోగించారు. ఫేజ్‌–3 క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రక్రియ సజావుగా సాగుతోందనీ, ఈ వ్యాక్సిన్‌ నవంబర్, లేదా డిసెంబర్‌లో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని సీడీసీ చీఫ్, బయోసేఫ్టీ ఎక్స్‌పర్ట్‌ గ్విన్‌జెన్‌ వూ వెల్లడించారు. ఏప్రిల్‌లో స్వయంగా తానే వ్యాక్సిన్‌ తీసుకున్న తరువాత, తనకు ఎటువంటి అసాధారణ లక్షణాలు కనిపించలేదని గ్విన్‌జెన్‌ వూ తెలిపారు. అయితే ఆమె ఏ వ్యాక్సిన్‌ తీసుకున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. చైనా ఔషధ దిగ్గజ సంస్థ నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ గ్రూప్‌(సినోఫార్మ్‌), సినోవా బయోటెక్‌ అత్యవసర కార్యక్రమం కింద మూడు వ్యాక్సిన్‌లను అభివృద్ధిచేస్తున్నాయి. కాన్‌సినో బయోలాజిక్స్‌ డెవలప్‌ చేసిన నాల్గో వ్యాక్సిన్‌ని చైనా సైన్యానికి ఉపయోగించేందుకు జూన్‌లో అనుమతి లభించింది. మూడవ దశ ట్రయల్స్‌ ముగిసిన తర్వాత ఈ ఏడాది చివరి నాటికి ఈ వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులో వస్తుందని సినోఫార్మ్‌ జూలైలో వెల్లడించింది.

మరిన్ని వార్తలు